ఐటీ దాడులు: రూ. 100 కోట్లు నగదు, 90 కేజీల బంగారు సీజ్, రూ. వేల కోట్ల అక్రమ ఆస్తులు!
చెన్నై: ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు తమిళనాడులోని ఎస్ పీకే అండ్ కో సంస్థను లక్షంగా చేసుకుని మెరుపుదాడులు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టులు తీసుకుంటున్న నెంబర్ వన్ సంస్థ అయిన ఎస్ పీకే అండ్ కో సంస్థ భారీ మొత్తంలో ఆదాయపన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసిందని ఆరోపణలు రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ఐటీ శాఖ అధికారులు చేస్తున్న దాడులకు ఆపరేషన్ పార్కింగ్ అనే కోడ్ పెట్టారు.
30 ప్రాంతాలు
సోమవారం వేకువ జామున నుంచి తమిళనాడులోని ఎస్ పీకే అండ్ కో సంస్థకు చెందిన 30 ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు గుర్తించి వాటి విలువ లెక్కిస్తున్నారు.
రూ. 100 కోట్లు, 90 కేజీల బంగారు
చెన్నైలోని పోయెస్ గార్డెన్, అభిరామపురం, కోవిలంబాక్కం, బెసెంట్ నగర్, క్రోంపేట తదితర ప్రాంతాల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు దాదాపు రూ. 100 కోట్ల నగదు, 90 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారంకు సక్రమంగా లెక్కలు లేవని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
రూ. వేల కోట్ల పత్రాలు
విరుద్ నగర్ జిల్లాలోని అరుప్పుకోటైలోని ఎస్ పీకే అండ్ కో సంస్థ యజమాని సెయ్యాదురై నివాసం, చెన్నైలోని ఆయన నివాసం, ఆయన కుమారులు, బంధువుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ఐటీ శాఖ అధికారుల సోదాల్లో రూ. వేల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు బయటపడటంతో వాటి విలువ ఎంత అని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
సీఎం చేతిలో ఆర్ అండ్ బీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆధీనంలో రహదారుల శాఖ ఉంది. సీఎం పళనిస్వామి రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల ప్రాజెక్టులను ఆయన బంధువులకు కట్టబెడుతున్నారని డీఎంకే జూన్ లో డీవీఏసీకి ఫిర్యాదు చేసింది.
కాంట్రాక్టర్లు టార్గెట్
ఎస్ పీకే సంస్థతో వ్యాపార సంబంధాలు ఉన్న టీవీహెచ్ కన్ స్టక్షన్స్ సంస్థ అధినేత రవిచంద్రన్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. డీఎంకే నేత, మాజీ మంత్రి కెఎన్. నెహ్రూకు స్వయానా రవిచంద్రన్ సోదరుడు.
మంత్రులతో లింక్ !
ఎస్ పీకే సంస్థకు చెందిన దాదాపు 30 బ్యాంకు అకౌంట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేసి పరిశీలిస్తున్నారు. ఎస్ పీకే సంస్థకు క్వారీలు, ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్ లతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఎస్ పీకే సంస్థ యజమాని సెయ్యాదురైకి అనేక మంది ప్రముఖులతో పాటు సీనియర్ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని సమాచారం.