‘పనామా పేపర్స్’పై ఐటీ వేగం: మరోసారి అమితాబ్కు చిక్కులు తప్పవా?
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. పనామా పేపర్స్ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన ఆదాయపుపన్ను శాఖ ఇప్పటికే 33మందిపై చర్యలకు ఉపక్రమించింది. తాజాగా, మరికొందరిపై కూడా దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ కేసులో అమితాబ్ సహా పలువురిపై ఆదాయపుపన్ను శాఖ దృష్టి సారించింది. పనామా పేపర్స్ లీక్ విచారణలో పురోగతి సాధించేందుకు గ్లోబల్ టాస్క్ ఫోర్స్లో చేరిన ఇండియా ఈ మేరకు అత్యున్నత స్థాయి బృందాన్ని కరేబియన్లోని బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్కు పంపింది.
పూర్తి సమాచారం వచ్చాకే..
పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో విచారించేందుకు ఉన్నత స్థాయి అధికారులను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కు పంపించినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు.సమాచారాన్ని సేకరించి, విశ్లేషించనున్నట్టు చెప్పారు. అయితే అమితాబ్కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించగా.. ఈ ఆరోపణలను అమితాబ్ ఇప్పటికే ఖండించారని.. పూర్తి సమాచారం వచ్చేంతవరకు విచారణ చేపట్టలేమన్నారు.
Recommended Video
సీనియర్ సీబీడీటీ
(సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్స్) అధికారిని బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలకు పంపించామనీ, వివిధ ఇతర దేశాలనుంచి దీనికి సంబంధించిన వివరాలను రాబడుతున్నట్టు ఆయన వివరించారు. అనంతరం ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించి, ఉల్లంఘనలను పరిశీలించనున్నట్టు ఆయన చెప్పారు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని పనామా పేపర్స్లో పేర్లు బయటకి వచ్చిన వారిపై విచారణను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పనామా సంచలనమే..
35 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పనామాకు చెందిన న్యాయ సంస్థ మోస్సాక్ ఫోన్సెకా ద్వారా ఈ పనామా కీలక పత్రాలు లీక్ అయ్యాయి. ఇది 1977- 2015 మధ్యకాలంలో 2,14,000 ఆఫ్షోర్ సంస్థలకు సంబంధించిన 11.5 మిలియన్ పత్రాలను కంపెనీ లీక్ చేసింది.
పనామా ప్రభావం..
విదేశీ బ్యాంక్ ఖాతాలున్న 50 దేశాల నుంచి 140 రాజకీయ వ్యక్తుల పేర్లను బహిర్గతం చేసింది. వీటిలో వివిధ దేశాల 12 మంది ప్రస్తుత లేదా మాజీ అధిపతులు, అలాగే క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీతారలు సహా, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న 29 మంది బిలియనీర్లు ఉన్నారు. కాగా, పనామా పేపర్ల వ్యవహారం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.