కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి.. కూడబెట్టింది రూ.400 కోట్లు
కేరళకు చెందిన ఎంకేఆర్ పిళ్లై ఐటీ శాఖ అధికారులు తనిఖీల్లో దొరికిపోయారు. ఈయన నాగలాండ్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించి పదవీవిరమణ పొందాడు. ఈయన ఏకంగా రూ. 400 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు.
కొచ్చి: మనిషికి ఎదిగేకొద్దీ సంపాదనపై మక్కువ మరింతగా పెరుగుతుందేమో. లేకపోతే, ఎంతో నిఖార్సయిన పోలీసు అధికారిగా రాష్టపతి పోలీసు మెడల్ అందుకున్న వ్యక్తి భారీ ఎత్తున అవినీతి, అవకతవకలకు పాల్పడడం ఏమిటి మన ఖర్మ కాకపోతేనూ. కానీ అదే జరిగింది.
కేరళకు చెందిన ఎంకేఆర్ పిళ్లై నాగలాండ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వర్తించి పదవీవిరమణ పొందాడు. ఈయనో పెద్ద అవినీతి తిమింగలం. ఏకంగా రూ. 400 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు.
పిళ్లైకి శ్రీవాలసమ్ గ్రూప్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పిళ్లైకి సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది.
విధుల్లో ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను తన సంస్థలోకి మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. కేరళ, కర్ణాటక, నాగలాండ్, ఢిల్లీలో పిళ్లైకి సంబంధించిన నివాసాలలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు
పిళ్లై 1971లో నాగలాండ్లో కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. ఆరేళ్ల క్రితం అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. ఉత్తమ సేవలు అందించినందుకు 2005లో ఆయన రాష్ట్రపతి పోలీసు మెడల్ కూడా అందుకున్నారు.
పిళ్లై సార్గా నాగలాండ్లో ఆయన అందరికీ సుపరిచితం. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులతో ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బినామీ పేర్లతో పలు సంస్థలు నడుపుతున్నట్లు అధికారుల సోదాల్లో వెలుగు చూశాయి.
ప్రస్తుతం పిళ్లై నాగలాండ్ పోలీసు శాఖలోనే కన్సల్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పిళ్లై అక్రమాస్తులకు సంబంధించి నాగలాండ్ డీజీపీ మాట్లాడుతూ.. పిళ్లై ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారని, వచ్చే వారం విధుల్లో చేరుతారని, అప్పుడు మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.