ఆ రోజు నా పని అయిపోయిందనుకున్నా, మానససరోవర్ వెళ్తా, శివభక్తులం కానీ: రాహుల్
న్యూఢిల్లీ: ఇటీవల ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ స్పందించారు. ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత తాను తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. కర్నాటక ఎన్నికల అసెంబ్లీ అనంతరం టిబిట్లోని మానస సరోవర యాత్రకు వెళ్తానని తెలిపారు.
ఢిల్లీలోని జన ఆక్రోష్ ర్యాలీలో ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం అంశంపై మాట్లాడారు.
విమానం 8వేల కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఆ ప్రమాదంతో తన పని అయిపోయిందనుకున్నానని, వెంటనే కైలాస్ మానససరోవర్ కు వెళ్లి దర్శించుకోవాలని నా మనసులో ఆలోచన వచ్చిందని, కర్ణాటక ఎన్నికల అనంతరం ఓ 15 రోజులు దాని కోసం కేటాయించాలనుకుంటున్నానని చెప్పారు.
నేను, నా కుటుంబ సభ్యులం శివ భక్తులమని, కానీ ఇలాంటి విషయాలు మేం ప్రయివేటుగా ఉంచుకుంటామని, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోమని రాహుల్ అన్నారు.
రాహుల్ ఉత్తర కన్నడ, కొడగు, మైసూరులో రెండు రోజుల పాటు ప్రచారం చేయడానికి గురువారం హుబ్బళ్లి విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన విమానం దిగుతున్న సమయంలో ఆటోపైలట్ మోడ్ సరిగా పని చేయలేదు. పెద్దగా శబ్దం చేస్తూ ఓ వైపునకు ఒరిగింది. అయితే పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై రాహుల్ సన్నిహితుడు కౌశల్ విద్యార్థి కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. అయితే, ఆటోపైలట్ మోడ్లో సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే పైలట్ మాన్యువల్ మోడ్లోకి మారి విమానాన్ని సురక్షితంగా కిందికి దించారని డీజీసీఏ వెల్లడించింది.