ఉద్విగ్న క్షణాలు.. మిన్నంటుతున్న రోదనలు..; 'జయ నాకు చెల్లెలు లాంటిది'
రాజకీయాలకు అతీతంగా జయలలిత ప్రాణాలతో బయటపడాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.
చెన్నై : క్షణం క్షణం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోన్న జయలలిత ఆరోగ్యం పరిస్థితి తమిళనాట విషాద ఛాయలు నింపుతోంది. అభిమానుల ఏడుపులు పెడ బొబ్బలతో ఆసుపత్రి వద్ద ఉద్విగ్న క్షణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లండన్ వైద్యుడు రిచర్డ్స్ కూడా తాము చేయగలిగింది చేశామని, పరిస్థితి చేయి జారిపోయిందన్న సంకేతాలను పరోక్షంగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే.. రాజకీయాలకు అతీతంగా జయలలిత ప్రాణాలతో బయటపడాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఎండీఎంకె అధినేత వైగో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. జయలలిత తనకు చెల్లెలు లాంటిదని, విషమ పరిస్థితి నుంచి ఆమె క్షేమంగా బయటికొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులతో రోదనలు మిన్నంటాయి. అమ్మ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ తీవ్రస్థాయిలో వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న నేపథ్యంలో.. ఇప్పటికే భారీ భద్రతా బలగాలను మోహరించారు. అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న హోటళ్లను పోలీసులు మూసివేయించారు.
అలాగే పలు స్కూల్స్ కు కూడా మధ్యాహ్నాం నుంచే సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఐటీ సంస్థలకు, పలు కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.