‘పాక్ పౌరసత్వాన్ని వదిలేశా.. ఇక నాది ఇండియానే’
న్యూఢిల్లీ: తాను తన పాకిస్థాన్ పౌరసత్వాన్ని త్యజిస్తున్నట్లు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే భారత ప్రభుత్వం ఇక్కడ సమీ ఎంతకాలమైనా ఉండేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సమీ ఆనందం వ్యక్తం వ్యక్తం చేశాడు. సమీ 42వ పుట్టిన రోజు ముంగిట ప్రత్యేక అనుమతి నేపథ్యంలో.. ఇది భగవంతుడిచ్చిన కానుక అని ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతించారు.
ఇకపై తన పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదిలేస్తున్నట్లు తెలిపారు. 14ఏళ్లుగా తనకు ఆశ్రయమిచ్చిన ఇండియానే ఇకపై తన సొంతగడ్డ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో సతమతమైన ఈ గాయకుడికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. చందమామపై విహరించినంత సంబరంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సమీ.
తాను భారతదేశంలోని ముంబైలో నివాసముంటున్నందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. ‘16ఏళ్లుగా భారత్ నాకు అందమైన ఇళ్లు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరి నుంచి చెప్పలేనంత ప్రేమను పొందా. నేను ఈ దేశాన్ని, ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నా. నాకు వేరే దేశస్థుడిననే భావన ఎప్పుడూ కలగలేదు. నేనెప్పుడు భారత దేశానికి కృతజ్ఞున్ని'అని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న బాలీవుడ్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్'లో సమీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. చిత్రంలో ‘భర్ దే జోలి మేరి యా మొహమ్మద్' అనే పాట పాడారు.