మాయావతి ట్వీట్ గురించి తెలియదు: సస్పెండ్ అయిన బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్
బెంగళూరు: కర్నాటకలో కుమారస్వామి సర్కార్కు తెరపడిన తర్వాత కర్నాటక అసెంబ్లీకి ఎన్నికైన ఒక్కగానొక్క బీఎస్పీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ అధిష్టానం వేటు వేసింది. బలపరీక్ష సందర్భంగా బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ సభకు గైర్హాజరవడంపై ఆ పార్టీ అధినేత్రి సీరియస్ అయ్యారు. సభకు హాజరై కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని అంతకుముందే మాయావతి ట్వీట్ చేశారు. అయితే ఎమ్మెల్యే మహేష్ మాత్రం సభకు గైర్హాజరయ్యారు.
దీనిపై ఎమ్మెల్యే మహేషన్ స్పందించారు.తనపై పార్టీ అధిష్టానం ఎందుకు వేటు వేసిందో అర్థం కావడం లేదని అన్నారు. అంతకుముందు సభకు గైర్హాజరు కావాలని చెప్పింది పార్టీనే అని ఆయన చెప్పారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మాయావతి చేసిన ట్వీట్ తన దృష్టికి వచ్చిందని మహేష్ తెలిపారు. సభకు హాజరై కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ఆదేశాలు జారీచేసినప్పటికీ ఎమ్మెల్యే మహేష్ బేఖాతరు చేసినందున పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేష్ పై వేటు వేస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు సుప్రీమో మాయావతి.
సభలో ఓటు వేయాల్సిందిగా తనకు ఎలాంటి సమాచారం లేదని అది కాక తాను బెంగళూరులో ఆ సమయానికి లేనని చెప్పారు మహేష్. బల నిరూపణ పరీక్షకు తాను హాజరు కావడం లేదని మహేష్ చెప్పని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోను బలపరీక్షకు హాజరుకావాలని మాయావతి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి బలపరీక్ష సందర్భంగా మహేష్ గైర్హాజరు అయ్యారు. దీంతో 99-105తో కుమారస్వామి సర్కార్ కథ ముగిసింది. మొత్తం మీద 20 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటే కొల్లెగళ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేష్... కుమార స్వామి ప్రభుత్వంలో ప్రాథమిక ఉన్నత విద్యాశాక మంత్రిగా పనిచేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆయన గతేడాది అక్టోబరులో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే కుమారస్వామి ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని నాడు ప్రకటించారు.