సంబంధం లేదని చెప్పలేదు: అబూ పెళ్లిపై మోనికా బేడీ
ముంబై: తాను అబూ సలేంను మనస్ఫూర్తిగా ప్రేమించానని, ఆయన ప్రేమలోనే పూర్తిగా ఉన్నానని ప్రముఖ నటి మోనికా బేడీ చెప్పారు. గ్యాంగ్స్టర్ అయిన అబూకు మోనికా బేడీ మాజీ ప్రియురాలు. కొన్ని రోజుల కిందట రైల్లో వెళుతున్నపుడు అబుకు ఓ మహిళతో పెళ్లి జరిగిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, అది అబద్దమని ఆ తర్వాత రోజు అతను ఓ ప్రకటన చేశాడు.
దీనిపై అబూ మాజీ ప్రియురాలైన నటి మోనికా బేడీ స్పందించింది. తన మనసులో ఇంకా అతనికి స్థానం ఉందని తెలిపింది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని తాను గౌరవిస్తానని తెలిపింది. అయితే, తమ ఇద్దరి మధ్య సంబంధం లేదన్న విషయాన్ని మాత్రం తిరస్కరించలేనని చెప్పింది.
ఎందుకంటే తమ ఇద్దరి మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ అన్నది. ప్రస్తుతం తన టీవీ షో, సినిమాల పనిలో బిజీగా ఉన్నానని, 2002లో అరెస్టు అయిన తర్వాత తామిద్దరం కాంటాక్ట్లో లేమని, అతనిని కలవక చాలా రోజులు అయిందని మోనికా బేడీ చెప్పింది.
అబూ సలేం రైలు పెళ్లి విషయంపై అడగ్గా తాను బిజీగా ఉన్నానని, దానిపై స్పందించేంత సమయం లేదని తెలిపింది. ఆయన పెళ్లి చేసుకొని ఉంటే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది.
కాగా, గ్యాంగస్టర్ అబూ సలేం ముంబైకి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రైలులో ఈ వివాహం జరిగినట్లు ఆ వార్తాకథనాలు చెబుతున్నాయి. జనవరి 8వ తేదీన ఈ రైలు వివాహం జరిగినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ మేరకు వార్తాకథనం వచ్చింది. కోర్టులో హాజరు పరచడానికి రైలులో తీసుకుని వెళ్తుండగా అబూ సలేం వివాహం జరిగినట్లు చెబుతున్నారు.
ముంబైకి చెందిన కాజీ ఫోన్లో నిఖా చేసినట్లు తెలుస్తోంది. సాక్షులుగా అబూ సలేం మేనల్లుడు రషీద్ అన్సారీ, ముంబై, లక్నోలకు చెందిన పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ముంబై మిర్రర్ పత్రిక అన్సారీని సంప్రదిస్తే అబూ సలేం వ్యక్తిగత విషయా నుంచి తనను దూరంగా ఉంచాలని, న్యాయపరమైన విషయాలేతే మాత్రమే తాను మాట్లాడుతానని చెప్పాడని టైమ్స్ ఇండియా రాసింది. అబూ సలేం వివాహం చేసుకున్న 27 ఏళ్ల మహిళ తరుచుగా టాడా కోర్టు వద్ద కనిపించేదట.
అయితే, ఆమె గురించి చాలా తక్కువ తెలుసునని టైమ్స్ ఇండియా వ్యాఖ్యానించింది. ముంబైలోని వ్యాపార లావాదేవీలను ఆమె చూస్తుందని చెబుతున్నారు. అబూ సలేం వివాహం గురించి పోలీసులు నోరు విప్పడానికి ఇష్టపడడం లేదు. లక్నోకు అబూ సలేంను తీసుకుని వెళ్లి, తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఎస్కార్టు పని అని వారంటున్నారు. రైలులో ఏం జరిగింది, ఎవరెవరు మాట్లాడుకున్నారనే విషయాలు పోలీసులకు అవసరం లేదని అంటున్నారట.