అది కూడా తెలియదా?: రాహుల్ వ్యాఖ్యలతో షాకయ్యానంటూ ప్రధాని మోడీ సెటైర్లు
పాండిచ్చేరి: కేంద్రంలో మత్య్సశాఖను ఏర్పాటు చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఒక జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2019లోనే కేంద్రంలో ఆ శాఖను ఏర్పాటు చేసిన విషయం కూడా రాహుల్కు తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు.
రాహుల్ వ్యాఖ్యలు ఆశ్చర్యపోయానంటూ మోడీ
'ఓ కాంగ్రెస్ నేత కేంద్రంలో మత్స్యశాఖ లేదంటూ వ్యాఖ్యలు చేయడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, అసలు నిజం ఏంటంటే.. ఇప్పటికే కేంద్రంలో ఆ శాఖ ఉంది. 2019లోనే కేంద్రంలో మత్స్యశాఖను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది' అని రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోడీ. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గురువారం పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోడీ. త్వరలో(ఏప్రిల్-మే)నే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
డివైడ్, లై, రూల్.. ఇదే కాంగ్రెస్ పాలసీ
గతంలో భారత ప్రభుత్వాన్ని బిట్రీష్ ప్రభుత్వంతో పోల్చడాన్ని ఈ సందర్భంగా ఖండించారు. బ్రిటీష్ పరిపాలకులు డివైడ్ అండ్ రూల్(విభజించి పాలించు) పాలసీని అమలు చేస్తే.. కాంగ్రెస్ మాత్రం డివైడ్, లై, రూల్(విభజించు, అబద్ధాలు, పాలించు) పాలసీని అమలు చేస్తోందని మోడీ విమర్శించారు. అప్పుడు ఆ పార్టీ నేతలు ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చులుపెడతారని మండిపడ్డారు.
మత్స్యశాఖకు మంత్రిని నేనంటూ రాహుల్కు గిరిరాజ్ సింగ్ కౌంటర్
ఫిబ్రవరి 17న పుదుచ్చేరిలో పర్యటించిన రాహుల్ గాంధీ.. ఇక్కడి మత్స్యకారులతో మాట్లాడుతూ.. కేంద్రంలో మత్య్సశాఖ లేదని, తాము అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని చెప్పడం గమనార్హం. దీంతో ఆ వెంటనే కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఇతర బీజేపీ నేతలు రాహుల్ గాంధీకి కౌంటర్లు ఇచ్చారు. కేంద్రంలో మత్య్సశాఖ ఉన్న విషయం కూడా రాహుల్కు తెలియదా? అని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ తాజాగా, కేరళ పర్యటనలో కూడా రాహుల్ అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నార్త్, సౌత్ అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్రంలో మత్స్యశాఖ లేదని, తాము ఏర్పాటు చేస్తామని కేరళ ప్రచారంలో కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేగాక, నార్త్, సౌత్ ఇండియా అంటూ వ్యాఖ్యలు చేయడం వివాస్పదమయ్యాయి. తాను 15ఏళ్లపాటు ఉత్తర భారతదేశంలో ఎంపీగా ఉన్నానని, అక్కడి రాజకీయాలు వేరుగా ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాను తొలిసారిగా సౌత్ ఇండియా నుంచి ఎంపీగా ఎన్నికయ్యానని, ఇక్కడి ప్రజలు ఎంతో విజ్ఞానవంతులుగా కనిపిస్తున్నారని, సమస్యల పట్ల వారికి అవగాన ఉందని చెప్పుకొచ్చారు.