క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు....నన్ను జైలులో చిత్రహింసలు పెట్టారు: ప్రియాంకా శర్మ
పశ్చిమ బెంగాల్ : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ఫోటోను ప్రియాంకా చోప్రా ఫోటోతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రియాంకా శర్మ అను బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం అక్కడ ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయింది. బెయిల్పై విడుదలైన ప్రియాంకా శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు.
అసలు తప్పే చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆమెకు నిన్నే బెయిల్ మంజూరు చేస్తే మరో 18గంటల పాటు జైలులోనే ఆమె గడపాల్సి వచ్చింది. బుధవారం ఉదయం 9గంటల40 నిమిషాలకు ఆమె విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ప్రియాంకా... తనను జైల్లో చిత్రహింసలకు గురిచేశారని చెప్పుకొచ్చింది. జైలర్ తనను తోసివేశాడని చెప్పారు. జైలులో పోలీసులు చాలా క్రూరత్వంతో ప్రవర్తించారని అక్కడి పరిస్థితులు కూడా చాలా అద్వానంగా ఉన్నాయన్నారు. అంతేకాదు బెయిల్ మంజూరు అయ్యాక కూడా తనను ఎవరితో మాట్లాడనివ్వకుండా చేశారని ప్రియాంకా శర్మ తెలిపారు.అంతకు ముందు ఐదు రోజులు కూడా తనను ఎవ్వరితో మాట్లాడకుండా చేశారని వెల్లడించారు.
ఇక జైలులో నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని చెప్పిన ప్రియాంకా టాయ్లెట్లలో కూడా నీళ్లు లేవని చెప్పారు.ఈరోజు స్వచ్ఛభారత్ గురించి మాట్లాడుతున్న మనము జైలులో పరిసరాలు శుభ్రంగా లేవని చెప్పారు. ఈ విషయాలపై జూలైలో తన కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సమయంలో మాట్లాడతానని చెప్పారు. తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డ ప్రియాంకా చాలామంది కార్టూన్లు షేర్ చేశారని వారినెందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు.
తన ఫోన్ను పోలీసులు లాక్కున్నారని మరోసారి ఇలాంటి ఫోటోలు షేర్ చేయమని చెప్పాల్సిందిగా బలవంతం పెట్టారని తెలిపారు ప్రియాంకా శర్మ. సొంత పూచీకత్తుపై ప్రియాంకా శర్మను సంతకం పెట్టమన్నారని సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్పై ఇదంతా లేదని ఆమె సోదరుడు చెప్పారు. ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయన్న అతను... మంగళవారం అమిత్ షా రోడ్ షోలో మమతా బెనర్జీ ఎంతటి హింసకు పాల్పడిందో చూస్తే తెలుస్తుందని చెప్పాడు.