చట్టాన్ని ఉల్లంఘిస్తాం: 40 అడుగుల ఎత్తులో ఉట్టి
థానే: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తుంగలో తొక్కింది. సుప్రీం కోర్టు ఆదేశాలు లెక్కచెయ్యకుండా థానే లో ఉట్టి కొట్టేందుకు ఏకంగా 40 అడుగుల ఎత్తు మానవ పిరమిడ్ నిర్మించింది.
గురువారం కృష్ణాష్టమి సందర్బంగా థానేలో 40 అడుగుల మానవ పిరమిడ్ ను నిర్మించి ఉట్టి కొట్టారు. అంతే కాకుండా నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను అనే రాతలు ఉన్న టీషర్టులను ఎంఎన్ఎస్ కార్యకర్తలు వేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణాష్టమి సందర్బంగా నిర్వహించే ఉట్టి వేడుకలపై సుప్రీం కోర్టు బుధవారం పలు ఆంక్షలు విధించింది. ఉట్టి కుండ కొట్టేందుకు 20 అడుగులకు మించి మానవ పిరమిడ్ నిర్మించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అదే విధంగా మైనర్లు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చూడాలని నిర్వహకులకు సూచించింది. ఉట్టి ఉత్సవాల్లో పలు ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం సంభవిస్తుండటంతో ముందు జాగ్రత చర్యగా ఈ ఆదేశాలు జారీ చేశారు.
మహారాష్ట్రలో చాల ప్రాంతాల్లో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు చోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లు నిర్మించి ఉట్టి కుండలు పగలగొట్టారు.
సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని మహారాష్ట్ర నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు తాను సిద్దంగా ఉన్నానని అన్నారు.
ఉట్టి ఉత్సవాల ఎత్తు విషయంలో ఆంక్షల చట్టం ఏమి లేదని చెప్పారు. ఉట్టి ఉత్సవాల ఎత్తు విషయంలో కోర్టు ఆదేశాలు మాత్రమే జారీ చేసిందని అన్నారు. మీకు ఇష్టం వచ్చిన ఎత్తులో ఉట్టి ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహించుకోవాలని రాజ్ ఠాక్రే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.