5ఏళ్లు సుస్థిర ప్రభుత్వంపై సోనియాతో చర్చిస్తా, 24 గంటల్లో నిరూపించుకుంటా: కుమారస్వామి
బెంగళూరు: తాను సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నానని జేడీఎస్ నేత కుమారస్వామి ఆదివారం వెల్లడించారు. కేబినెట్ కూర్పుపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే, రానున్న అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా ఇవ్వాలో కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామని చెప్పారు.
తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని తెలిపారు. సోమవారం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తానని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇరు పార్టీల నేతలు ఈ రోజు సమావేశమై బలనిరూపణ, కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి పదవులను కాంగ్రెస్ నేత పరమేశ్వరకు ఇవ్వనున్నారు. ఇతర మంత్రి పదవులపై కూడా దాదాపు నిర్ణయానికి వచ్చారు. మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.
Tomorrow I will be going to Delhi, where I will meet Sonia ji and Rahul ji. We will decide about cabinet expansion. I will discuss everything with them on how to give a stable government for the next 5 years: HD Kumaraswamy, #Karnataka CM designate pic.twitter.com/f4H4mgaZhP
— ANI (@ANI) May 20, 2018
ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కాలనే విషయంపై కూడా మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా రిసార్టులకే పరమితమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక విధాన సభలో శనివారం యడ్యూరప్ప బలనిరూపణకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే బలనిరూపణకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.