నచ్చకపోతే చదవొద్దన్న కోర్టు.. : పెరుమాల్ కు బూస్టింగ్
చెన్నై : నిజాలను నిర్భయంగా బహిరంగపరచడం.. సమాజ స్థితిగతులను రచనల ద్వారా ఏకరువు పెట్టడం.. వాస్తవ పోకడలపై ఆయా రచయితలు స్పందించే తీరు. అయితే కుల మత ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే దేశంలో రచనల్లో నిజాలను ప్రతిబింబించేలా చేయడాన్ని జీర్ణించుకోలేని మత ఛాందస వాదులు సదరు రచయితలపై కక్ష కట్టడం తరుచూ జరుగుతున్నదే.
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ విషయంలో గత కొంతకాలంగా ఇదే జరుగుతూ వస్తున్నది. ఆయన రాసిన మధోరుభాగన్ (వన్ స్థార్ ఆఫ్ ఏ వుమెన్) ను వ్యతిరేకిస్తూ అక్కడి హిందూ మత ఛాందసవాదులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. దీంతో గత ఏడాది క్రితం నుంచి వివాదం రగులుతూనే ఉంది. ఒకానొక దశలో హిందూ సంస్థలకు క్షమాపణ చెప్పి ఉన్న ఊరిని విడిచి వెళ్లడానికి కూడా సిద్దపడ్డారు మురుగన్.
'మరణించా', అధ్యాపకుడిగానే: వివాదాలపై విసిగిన రచయిత
రచయిత పెరుమాల్ కు అనుకూలంగా తీర్పు :
ఇదిలా ఉంటే, రచయిత పెరుమాల్ మురుగన్ తాజాగా తమిళ హైకోర్టు అనుకూలంగా తీర్పును వెలువరించడంతో విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. మధోరుభాగన్ నవలా ప్రతులను నిషేధించాలని కోరుతూ మత ఛాందసవాదులు హైకోర్టు మెట్లక్కగా.. దీనిపై తుది తీర్పు వెల్లడించిన న్యాయస్థానం, 'మీకు నచ్చకపోతే సదరు రచయిత పుస్తకాలను చదవకండి..' అంటూ మత ఛాందసవాదులకు షాక్ ఇచ్చింది.
దీనిపై స్పందిస్తూ.. 'రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 1-ఏ ప్రకారం దేశలో ప్రతీ వ్యక్తికి తన భావాలను ప్రకటించుకునే హక్కు ఉందని' తెలిపింది కోర్టు. కాగా, మత ఛాందస వాదులు తనపై కక్ష కట్టడంతో ఇన్నాళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్న మురుగున్ తాజా తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తీర్పు తనకు అనుకూలంగా వెలువడంతో, ఈ తీర్పు తన రచనలు పునరుజ్జీవం పోసుకునేందుకు తోడ్పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
అసలెందుకీ వివాదం :
రచయిత పెరుమాల్ మురుగన్ 2010 లో మధోరుభాగన్ అనే ఓ తమిళ నవల రాశారు. ఆ తర్వాత వన్ స్థార్ ఆఫ్ ఏ వుమెన్ పేరుతో అది ఆంగ్లంలోకి అనువాదం అయింది. దీంతో నవల పేర్కొన్న పలు అంశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి ఆర్ఎస్స్ఎస్ సహా పలు హిందూ సంస్థలు.
ప్రాణాలకు ముప్పు: ఇంటికి తాళాలేసి వెళ్లిపోయిన మురుగన్
ఇంతకీ ఆ నవలలో వివాదస్పదమైన అంశం ఏంటంటే.. సుమారు వందేళ్ల క్రితం తిరుచెంగోడ్ అర్థనారీశ్వరుని ఆలయంలో అమలులో ఉన్న ఆచారం గురించి ఆయన ప్రస్తావించడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఆ ఆచారం ప్రకారం ఎవరైతే సంతానం లేని మహిళలు ఉంటారో, రథోత్సవం జరిగే నాడు వారంతా పర పురుషుడితో శారీరకంగా కలవడానికి అనుమతి ఉండేదని అప్పటి ఆచారం గురించి పుస్తకంలో ప్రస్తావించారు మురుగన్.
ఈ ఆచారంపై అప్పటి సామాజిక స్థితిగతులను ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చారు. కాగా దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం తెలుపుతూ మత ఛాందసవాదులు ఆయన్ను కొంతకాలంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు.