'పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు, తుది శ్వాస వరకు దేశసేవ'
తన తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవ చేస్తానని జవాన్ విక్కీ విశ్వకర్మ తెలిపారు. ఇటీవల జమ్ము కాశ్మీర్లో స్థానిక యువత దాడి చేసినా మౌనంగా భరిస్తూ తన విధులు నిర్వర్తించి అందరి మనసు గెలుచుకున్నారు.
న్యూఢిల్లీ: తన తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవ చేస్తానని జవాన్ విక్కీ విశ్వకర్మ తెలిపారు. ఇటీవల జమ్ము కాశ్మీర్లో స్థానిక యువత దాడి చేసినా మౌనంగా భరిస్తూ తన విధులు నిర్వర్తించి అందరి మనసు గెలుచుకున్నారు.
ఇటీవల ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను రాళ్లు రువ్వే వారిని చూసి భయపడనని, అక్కడి వారు పాకిస్థాన్ జిందాబాద్, గో ఇండియా-గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ రెచ్చగొడుతున్నా నిగ్రహంతో ఉన్నానని చెప్పారు.
అది చాలా సున్నితమైన ప్రదేశమని, దేశ క్షేమం కోసం ఆ సమయంలో స్పందించలేదన్నారు. తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలనుకున్నానని, మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలు ఏవిధంగా కాపాడాలో శిక్షణలో బాగా నేర్పించారని చెప్పారు. అందుకే ఆ సమయంలో మౌనంగా ఉన్నానని చెప్పారు.
దీనిపై విశ్వకర్మ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడిని సరిహద్దుల్లో విధులకు వేశారంటే తొలుత భయపడ్డానని పేర్కొన్నారు. కానీ అతను విధులు నిర్వహించిన తీరు చూసి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తన కుమారుడు దేశానికి సేవ చేస్తారన్నారు.