రూ.50 కోట్లకు పరువు నష్టం దావా, క్షమాపణలు చెప్పను: డిఐజీ రూప
పరప్పర అగ్రహర జైలులో శశికళతో పాటు తెల్గీకి విఐపి సౌకర్యాలు అందాయనే విషయానికి తాను కట్టుబడి ఉన్నానని బెంగుళూరు నగర ట్రాఫిక్ కమిషనర్ రూప ప్రకటించారు.
బెంగుళూరు: పరప్పర అగ్రహర జైలులో శశికళతో పాటు తెల్గీకి విఐపి సౌకర్యాలు అందాయనే విషయానికి తాను కట్టుబడి ఉన్నానని బెంగుళూరు నగర ట్రాఫిక్ కమిషనర్ రూప ప్రకటించారు. ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారామె.
బాధ్యత గల ప్రభుత్వ అధికారిగా జైళ్ళలో జరుగుతున్న అక్రమాల గురించి పై స్థాయి అధికారులకు తెలియజేయడమే తన ధ్యేయమన్నారు.
ఈ విషయంలో న్యాయపోరాటానికి కూడ సిద్దమేనని కూడ ఆమె స్పష్టం చేశారు. పరప్పర అగ్రహర జైలు వ్యవహరంపై పోలీసు శాఖతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
పరప్పర జైళ్లో శిక్షను అనుభవిస్తున్న శశికళకు, తెల్గీకి విఐపీ సౌకర్యాలు కల్పించేందుకు గాను అప్పటి జైళ్ళ శాఖ డిజిపి సత్యనారాయణరావుకు రూ.2 కోట్లు లంచం తీసుకొన్నారని ఆమె ఆరోపించింది.
అయితే తాను ఏ తప్పు చేయలేదని ఆమె ప్రకటించారు. అనవసరంగా నిందలు వేసినందుకుగా మూడు రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని డీజీపీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ ఆయన ఆమెకు లీగల్ నోటీసులు పంపారు.
అయితే రూప మాత్రం తాను ప్రభుత్వానికి అందించిన నివేదికల్లోని అవసరమైన ఆధారాలను అందించినట్టు చెప్పారు. ఈ విషయమై తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని ఆమె ప్రకటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శశికళ కోర్టు ద్వారా ఏ కేటగిరి హోదాను పొందారని డీజీపీ సత్యనారాయణరావు అభిప్రాయపడుతున్నారు. అయితే రూప చేస్తోన్న వాదనలకు బలం చేకూరే అవకాశం లేదని సత్యనారాయణరావు సన్నిహితులు అభిప్రాయంతో ఉన్నారు.