ఆ ఇద్దరే నాకు స్సూర్తి, కమల్ హసన్కు ఫోన్ చేస్తా: విశాల్
చెన్నై: ప్రజా నేతగా అందరి మన్ననలు అందుకోవడమే తన ముందున్న లక్ష్యమని సినీ నటుడు విశాల్ చెప్పారు., పెద్దగా రాజకీయ ఆకాంక్షలు ఏమీ లేవన్నారాయన. ఎన్నికల్లో పోటీ చేయగలననే దమ్ముతోనే పోటీ చేస్తున్నట్టు విశాల్ స్పష్టం చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉంటుందని భావించారు.
ఆర్కె నగర్ బై పోల్: పోటీ చేయనున్న విశాల్, 2021 నాటికి కొత్త పార్టీ?
అయితే విశాల్ పోటీకి సిద్దమయ్యారు. విశాల్ రంగంలోకి దిగడంతో చతుర్ముఖ పోటీ ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానంలో నెలకొంది. సంచలనాలకు విశాల్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తారు. ఆర్కె నగర్లో బరిలోకి దిగుతున్న విశాల్తో ఓ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విశాల్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఆ ఇద్దరూ స్పూర్తి
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తనకు స్ఫూర్తి అని విశాల్ తెలిపారు. ఆ ఇద్దరూ నాకు స్ఫూర్తి అని విశాల్ చెప్పారు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ను నేనెప్పుడూ కలుసుకోలేదు. అయితే ఆయన ప్రజానేత. నేను రాజకీయవేత్త కావాలనుకోవడం లేదని విశాల్ చెప్పారు.
ఓ సాధారణ వ్యక్తిగానే ఉండాలనుకుంటున్నానని విశాల్ చెప్పారు.
ఆర్కె నగర్ ప్రజల వాణిని వినిపిస్తా
తనకు పెద్దగా రాజకీయ ఆకాంక్షలేవీ లేనప్పటికీ ప్రజా నేతగా అందరి మనస్సులోనూ నిలిచిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆర్కే నగర్ ప్రజల వాణి వినిపించాలని అనుకుంటున్నానని విశాల్ ప్రకటించారు. ప్రజా ప్రతినిధి కావాలనుకుంటున్నాను. నేను పూర్తి స్థాయి రాజకీయవేత్త కావాలనుకోవడం లేదు. అలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలేవీ లేవు. ఎన్నికల్లో పోటీ చేయగలననే దమ్ముతోనే బరిలోకి దిగుతున్నానని విశాల్ చెప్పారు.
మద్దతిస్తే స్వీకరిస్తా
ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే సినీ పరిశ్రమ నుంచి కూడా ఆనూహ్యమైన స్పందన వచ్చిందని విశాల్ చెప్పారు. 'నేను ఎవరినీ కలుసుకోవడం లేదు. భావసారూప్యత కలిగిన వ్యక్తులు నాకు మద్దతిస్తే స్వాగతిస్తాను. కుష్బూ, ప్రకాష్ రాజ్, ఆర్య ఇప్పటికే తమ మద్దతు ప్రకటించారు. చాలామంది నుంచి అభినందనలు వస్తున్నాయని అని విశాల్ వెల్లడించారు.
కమల్హసన్కు ఫోన్ చేస్తా
కమల్ సార్ నుంచి ఇంతవరకూ ఫోను రాలేదు. నామినేషన్ వేసిన తర్వాత నేనే ఆయనకు ఫోన్ చేస్తా అని విశాల్ నవ్వుతూ చెప్పారు. ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని విశాల్ చెప్పారు. అంతేకాదు ప్రజల సమస్యలను ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆపకూడదని చెప్పారు. తెలుగు కుర్రాడే అయినా అటు తమిళనాట కూడా విశేషాభిమానులను చూరగొన్న నటుడు విశాల్ ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా సైలెంట్ ఎంట్రీ రాజకీయంగా సంచలనంగా మారింది.