రాజ్యసభకు ఎందుకు వెళ్లాలనుకున్నానో ప్రమాణస్వీకారం అయ్యాక చెబుతా: జస్టిస్ రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన కొద్ది గంటలకే పలు రాజకీయ పార్టీలు ఆయనపై విమర్శలకు దిగాయి. అయితే రాష్ట్రపతి కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని అడిగినప్పుడు ఆ ఆఫర్ను ఎందుకు తీసుకున్నానో త్వరలో చెబుతానని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. బుధవారం రోజున ఢిల్లీకి వెళ్లి ఎంపీగా ప్రమాణస్వీకారం చేశాక ఆ తర్వాత పూర్తి వివరాలను మీడియాకు చెబుతానని జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు.
అంతకంటే ముందు జస్టిస్ రంజన్ గొగోయ్ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. క్విడ్ ప్రొ కో కిందనే నామినేట్ అయ్యారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దేశ అత్యున్నత న్యాయస్థానంకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఎలాంటి సందేశం పంపుతున్నారని కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య ప్రశ్నించారు. అదే సమయంలో ఓవైసీ కూడా ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు.
ఇక మరో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ బి లోకూర్ కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జస్టిస్ రంజన్ గొగోయ్కు ఎలాంటి పదవి వస్తుందో అన్న మీమాంస ఉండేదని ఇక ఆయన్ను రాజ్యసభకు పంపడంతో అది కూడా క్లియర్ అయ్యిందని జస్టిస్ మదన్ బి లోకూర్ చెప్పారు. అయితే ఇంత త్వరగా పదవి రావడమే ఆశ్చర్యం కలిగించిందని జస్టిస్ మదన్ లోకూర్ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ యొక్క స్వంతంత్రత, నిష్పక్షపాతం, సమగ్రత ఈ ఘటనతో కొత్త నిర్వచనం అందిపుచ్చుకుందని చెప్పారు. చివరిగా ఉన్న ఒక్క కోటకూడా పడిపోయిందని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
2018 జనవరిలో జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు పాలనావ్యవస్థ గురించి ప్రశ్నించారు. నాటి చీఫ్ జస్టిస్గా ఉన్న దీపక్ మిశ్రాపై నిప్పులు చెరిగారు. అంతేకాదు రెండు నెలల క్రితం నలుగురు జడ్జిలు కలిసి అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు రాసిన లేఖను కూడా మీడియా ముందు ఉంచి వార్తల్లో నిలిచారు.