ఎకనామిక్ స్లోడౌన్: ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోవాలంటూ నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మందగమనాన్ని నియంత్రించేందుకు ఏదైనా ఓ నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ద్రవ్య సంక్షోభం ఏర్పడిందని, వెంటనే నిర్ణయం తీసుకోకపోతే సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు.
'నేను నా నివాసానికి సీనియర్ అధికారులను పిలిచాను. దాదాపు రూ. 89,000 కోట్ల కేసులు ఉన్నాయని వారికి చెప్పాను. నేను మీకు ఏం చేయాలో చెప్పను.. కానీ, దేశ ఆర్థిక పరిస్థితి సవాలుగా మారింది. ప్రస్తుతం ద్రవ్య కొరత ఉంది. ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోండి' అని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
సీఏఏపై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ)లపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మనదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు తిరిగి వెళ్లిపోవడానికి చాలా అవకాశాలున్నాయని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 ఇస్లామిక్ దేశాలున్నాయని, వాటిల్లో ఏ దేశానికైనా వారు వెళ్లవచ్చునని కేంద్రమంత్రి చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో వివక్షకు, హింసకు గురవుతున్న మైనార్టీలకు ఇండియా తప్ప మరో అవకాశం లేదని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంకు మద్దతుగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీ ఎత్తున ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.