coronavirus effect: చైనా నుంచి భారత్కు 112 మంది, జపాన్ ఓడ నుంచి భారతీయుల తరలింపు..
కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోంది. వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. కష్ట సమయంలో చైనాకు ఇతరదేశాలు ఆపన్నహస్తం అందిస్తోన్నాయి. 15 టన్నుల వరకు మందులు, సామాగ్రిని భారత వైమానిక దళ విమానం చైనాలోని వుహాన్ పంపించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు వైమానిక దళం విమానంలో కూడా కిట్లను పంపించారు. వుహాన్ నుంచి ఆ విమానం వచ్చే సమయంలో 112 మంది భారత్ తీసుకొచ్చారు. ఈ నెల మొదటి వారంలో రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో దాదాపు 650 మంది వరకు భారతీయులను తరలించారు.
15 టన్నుల మందులు
ఆపత్కాలంలో చైనాకు అండగా నిలువాలని భావించామన్నారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. అందుకోసమే చైనాకు మందులను పంపించామని తెలిపారు. సీ-17 గ్లోబ్ మాస్టర్ మిలిటరీ విమానంలో మాస్క్లు, గ్లౌజ్లు, ఇతర వైద్య సంబంధిత పరికరాలను పంపించామని తెలిపారు. చైనాలో భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకొని.. 15 టన్నుల వైద్య కిట్లను అందజేశామని వివరించారు.
భారత్కు 112 మంది
తిరిగి భారత్ వచ్చే సమయంలో 112 మందిని విమానంలో తీసుకొచ్చారు. ఇందులో 76 మంది భారతీయులు ఉండగా, 23 మంది బంగ్లాదేశ్, ఆరుగురు చైనా, ఇద్దరు చొప్పున మయన్మార్, మాల్దీవులు.. సౌత్ ఆఫ్రికా, అమెరికా, మడగాస్కర్కి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఇందులో ఆరుగురు చైనియులు భారతీయులను తమ జీవిత భాగస్వాములుగా చేసుకున్నారని వివరించారు. వీరందరినీ కూడా 14 రోజులపాటు పరిశీలించిన తర్వాతే.. వారి స్వస్థలాలకు పంపిస్తామని జై శంకర్ స్పష్టంచేశారు.
Recommended Video
జపాన్ నుంచి కూడా..
మరోవైపు జపాన్ యోకోహమా తీరంలో ఉన్న డైమండ్ ప్రిన్సెస్ ఓడలో ఉన్న భారతీయులను కూడా భారత్ తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానం అక్కడికి చేరుకుంది. షిప్లో ఉన్న భారతీయులకు ఇప్పటికే కరోనా వైరస్ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్ రానీ వారిని గురువారం భారత్ పంపిస్తున్నారు. ఈ మేరకు జపాన్లోని భారతీయ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ నెల 3వ తేదీన యెకోహామా తీరంలో నిలిచిన డైమండ్ షిప్లో కరోనా వైరస్ జాడ కనిపించింది. అందులో మొత్తం 3711 మంది ప్రయాణికులు ఉండగా.. 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 132 మంది ప్రయాణికులు కాగా.. ఆరుగురు సిబ్బంది ఉన్నారు.