అదుపు తప్పి..రన్వేను దాటుకుని! విమానాశ్రయంలో ప్రమాదం
ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో విమానం అదుపు తప్పింది. రన్వేపై జారిపోయింది. గతుకుల రోడ్డు మీదికి వచ్చి ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ప్రాథమికంగా అందిన సమాచారం. ఈ విషయాన్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ ధృవీకరించింది. వైమానిక దళానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురైందని అంటూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు స్వల్పంగా ఆటంకం ఏర్పడింది.
ముంబై నుంచి బెంగళూరుకు..
ముంబై నుంచి మంగళవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరింది ఈ ఎయిర్క్రాఫ్ట్. బెంగళూరులోని యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకోవాల్సి ఉంది. రన్వేపై టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదానికి గురైంది. 11:39 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. టేకాఫ్ సమయంలో అదుపు తప్పింది. ఊహించిన దానికంటే వేగంగా ఉండటం వల్ల పైలెట్ దాన్ని నియంత్రించలేకపోయారు. రన్వేపై జారుకుంటూ వెళ్లిపోయింది. గతుకుల రోడ్డు మీద కొంతదూరం ప్రయాణించి- నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
ఈ ఘటన వల్ల రన్వే కొంతభాగం ధ్వంసమైంది. దీనితో విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. రెండో రన్వేను అందుబాటులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయం సిబ్బంది విమానాన్ని యధాస్థితికి తీసుకుని రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.