ఇంకా లభ్యం కానీ ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ఆచూకీ..శిథిలాలు దొరికాయంటూ ప్రచారం
అరుణాచల్ ప్రదేశ్: సోమవారం అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల్లో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళంకు చెందిన విమానం ఏఎన్-32 ఆచూకీ ఇంకా దొరకలేదు. యుద్ధ విమానం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 12 గంటలకు పైగా సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. విమానం తప్పిపోయిన సమయంలో అందులో 15మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం ఆచూకీ కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీ-130 జే ఇండియన్ ఆర్మీకి చెందిన గ్రౌండ్ ప్యాట్రోల్ సిబ్బందిలు సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
శిథిలాలు దొరికాయంటూ వార్తలు
యుద్ధ విమానం ఎక్కడుందో కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది భారత ఆర్మీ. ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలోని టాటూలో విమానంకు సంబంధించిన శిథిలాలు దొరికినట్లు సమాచారం. అయితే అలాంటిదేమీ లేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. అస్సోంలోని జోర్హత్ నుంచి ఏఎన్ - 32 విమానం సోమవారం టేకాఫ్ అయ్యింది. అయితే గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే గ్రౌండ్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్లోని మేంచుకా ఎయిర్ఫీల్డ్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ విమానం అదృశ్యమైంది. ఇక ఇందులో 15 మంది ఉండగా అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన సిబ్బందే అని అధికారులు తెలిపారు.
రంగంలోకి దిగిన సుఖోయ్ -30 యుద్ద విమానాలు
మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు టేకాఫ్ తీసుకున్న ఏఎన్-32 విమానం చివరిసారిగా 1 గంటకు గ్రౌండ్ సిబ్బందితో టచ్లోకి వచ్చింది. ఇక చేరాల్సిన గమ్యస్థానానికి చేరకపోవడంతో అధికారులు దీనిపై ఆరా తీయగా అదృశ్యమైనట్లు గమినించారు. ఇక ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుందో గుర్తించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక సుఖోయ్ -30 యుద్ధ విమానాలను కూడా సెర్చ్ ఆపరేషన్కు రంగంలోకి దించారు. వీటితో పాటు పలు హెలికాఫ్టర్లతో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఏఎన్-32 విమానం అదృశ్యమవడంపై ఆవేదన వ్యక్తం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్... పరిస్థితిని తానే స్వయంగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
2009లో తప్పిపోయిన ఏఎన్-32 విమానం
ఇదిలా ఉంటే ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం మిస్ కావడం ఇది తొలిసారి కాదు. 2009 జూన్లో కూడా అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలోని హెయో గ్రామంలో కూలింది. ఆ సమయంలో 13 మంది సిబ్బంది మృతి చెందారు. ఈ విమానంలో ఏడుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది , ఆరుమంది భారత ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. మేచుకా ఎయిర్ఫీల్డ్కు 30 కిలోమీటర్ల దూరంలో శిథిలాలు దొరికాయి. 9 జూన్ 2009లో మేచుకా ఎయిర్ఫీల్డ్ నుంచి అస్సోంలోని మోహనబరీ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు వెళ్లాల్సి ఉండగా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గ్రౌండ్ సిబ్బందితో కాంటాక్ట్ కోల్పోయి ప్రమాదానికి గురైంది.