నదిలో చిక్కుకుపోయారు: హెలికాప్టర్ సాయంతో 19మంది కాపాడిన ఐఏఎఫ్
ఈటానగర్: భారత వైమానిక దళ(ఐఏఎఫ్)అధికారులు.. హెలికాప్టర్ల సహాయంతో ద్వీపంలో చిక్కుకుపోయిన 19మందిని కాపాడారు. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడి ఓ ద్వీపంలో 19మంది చిక్కుకుపోయారు. నదిలో ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో నీటి మధ్యలో వారంతా ఉండిపోయారు.
చైనాలో భారీ వర్షాల కారణంగా అక్కడి సాంగ్పో నది ఉద్ధృతంగా ప్రవహించడంతో దిగువన ఉన్న అరుణాచల్ప్రదేశ్లోని నదిలోకి విపరీతంగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే రోజువారీ వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వారు ఆ ద్వీప ప్రాంతంలో చిక్కుకుపోయారు. నది మధ్యలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో వైమానిక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.
#SavingLives : A total of 19 persons (13 adults & 6 children) were rescued from the Island. 06 persons including 02 children winched up & rest rescued to safety by landing at site. pic.twitter.com/U8cCks2ixN
— Indian Air Force (@IAF_MCC) August 31, 2018
హెలికాప్టర్లను ఉపయోగించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నీటి ఉద్ధృతి కారణంగా పడవల ద్వారా వారిని తీసుకురావడం అసాధ్యమని భావించిన అధికారులు ఐఏఎఫ్ను సంప్రదించడంతో వారు వెంటనే స్పందించారు.