డెకాయ్ ఆపరేషన్: పాక్ ను దెబ్బకొట్టిన వైమానిక దళం.. సరికొత్త వ్యూహాన్ని అనుసరించిన వైనం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల, పాకిస్థాన్ భూభాగంలో ఉన్నపై ఉన్న బాలాకోట్లో సమీపంలోని జైషె మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై కిందటి నెల 26వ తేదీన దాడి సమయంలో భారత వైమానిక దళం సరికొత్త వ్యూహాలను అనుసరించింది. ప్రత్యర్థిని అతి సులువుగా బోల్తా కొట్టించగలిగింది. సరిహద్దులకు అవతల పహారా కాస్తున్న పాక్ యుద్ధ విమానాల కన్నుగప్పడానికి భారత వైమానిక దళం కొన్ని జెట్ ఫైటర్లతో డెకాయ్ ప్యాకేజీని ఏర్పాటు చేసింది.
తన శతృవు దృష్టి మరల్చడానికి, గందరగోళంలో పడేయడానికి డెకాయ్ ప్యాకేజీ వ్యూహాన్ని అనుసరించింది భారత్. డెకాయ్ ప్యాకేజీతో సరిహద్దులకు అవతల పహారా కాస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాలు దారి మళ్లాయి. దీనితో తమ పనిని ఎలాంటి ఆటంకం లేకుండా ముగించేసింది భారత వైమానిక దళం.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడానికి వైమానిక దళం మిరాజ్-2000, సుఖోయ్-ఎంకేఐలను విస్తృతంగా వినియోగించిన విషయం తెలిసిందే. దీనితో పాటు- యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే ట్యాంకర్ క్రాఫ్ట్, ఎయిర్ బోర్న్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ లు గల తేలికపాటి విమానాలను రంగంలో దింపింది. మిరాజ్-2000 యుద్ధ విమానాలు శతృస్థావరాలపై బాంబులను ప్రయోగించగా.. మిగతా విమానాలు భారత గగనతలంలోనే ఉంటూ వాటికి రక్షణగా నిలిచాయి.
అదే సందర్భంలో పహారా కాస్తున్న పాక్ యుద్ధవిమానాల దృష్టి మన వాటిపై పడకుండా ఉండటానికి వైమానిక దళం కొన్ని సుఖోయ్-30 ఎంకేఐ విమానాలతో ఈ డెకాయ్ ప్యాకేజీ వ్యూహాన్ని పన్నింది. పాక్ యుద్ధ విమానాలను ఆకట్టుకునేలా సుఖోయ్ విమానాలు ఉద్దేశపూరకంగా సరిహద్దులకు ఆనుకునే ఉన్న పంజాబ్లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్నాయి.
టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సుఖోయ్ విమానాలు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లో కొనసాగుతున్న జైషె మహమ్మద్ ప్రధాన కేంద్రం బహవల్పూర్ దూసుకెళ్లాయి. దీనితో అప్రమత్తమైన పాక్ గస్తీ విమానాలు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. పహారా కాస్తున్న యుద్ధ విమానాలు సరిహద్దుల్లో లేకపోవడం భారత వైమానిక దళానికి కలిసి వచ్చింది. పాక్ గగనతలంలోకి వెళ్లి, ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి వచ్చేశాయి.