‘మా వాణ్ని వీసీ చేయండి! మధ్యప్రదేశ్ గవర్నర్కు అమిత్ షా ఫోన్’: ఐఏఎఫ్ అధికారి అరెస్ట్..
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్లో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. తాను కేంద్రమంత్రి అమిత్ షా అంటూ ఏకంగా గవర్నర్కే ఫోన్ చేశాడు ఈ అధికారి. అంతేగాక, తన స్నేహితుడిని మెడికల్ యూనివర్సిటీకి వీసీగా నియమించాలంటూ సూచించాడు. దీంతో దర్యాప్తు జరిపిన ఎస్టీఎఫ్.. అతడ్ని శుక్రవారం అరెస్ట్ చేసింది.
కేంద్ర హోంమంత్రినంటూ గవర్నర్కు ఫోన్..
ఎస్టీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ) అశోక్ అవాస్థి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ కుల్దీద్ బఘేలా ప్రస్తుతం ఢిల్లీలోని ఐఏఎఫ్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నారు. గవర్నర్తో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా అమిత్ షాగా కుల్దీప్ బఘేలా చెప్పుకుంటే.. ఆయన పర్సనల్ అసిస్టెంట్(పీఏ)గా కుల్దీప్ స్నేహితుడు, భోపాల్కు చెందిన డెంటిస్ట్ చంద్రేశ్ కుమార్ శుక్లా చెప్పుకున్నారు.
వీసీగా నియమించాలంటూ గవర్నర్కు సిఫార్సు..
కుల్దీప్ బఘేలా మధ్యప్రదేశ్ గవర్నర్కు ఫోన్ చేసి తన స్నేహితుడైన చంద్రేశ్ కుమార్ శుక్లాకు జబల్పూర్లోని మధ్యప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ (ఎంపీఎంఎస్యూ)కు వైస్ ఛాన్సలర్గా నియమించాలంటూ సిఫార్సు చేశారని తెలిపారు. కేంద్రమంత్రి అమిత్ షాగా చెప్పుకున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ కుల్దీప్ బఘేలాను అరెస్టు చేసినట్లు ఎస్టీఎఫ్ ఏడీజీ వెల్లడించారు. కుల్దీప్ స్నేహితుడైన డెంటిస్ట్ చంద్రేశ్ కుమార్ శుక్లాను కూడా అరెస్ట్ చేసినట్లు అవాస్తి తెలిపారు. వీరిద్దరూ కూడా 35-40ఏళ్ల మధ్య వయస్కులని చెప్పారు.
వీసీ కావాలనే కోరికతోనే ఇలా..
బఘేలా గతంలో మధ్యప్రదేశ్ గవర్నర్గా రాంనరేశ్ యాదవ్ ఉన్న సమయంలో ఆయన దగ్గర మూడేళ్లపాటు ఎయిడ్ డే క్యాంప్(ఏడీసీ)గా పనిచేశారని వెల్లడించారు. కాగా, శుక్లా ఎంపీఎంఎస్యూ వైస్ ఛాన్సలర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారని, అది ప్రాసెస్లో ఉందని ఏడీజీ తెలిపారు. ఈ క్రమంలో తాను ఆ యూనివర్సిటీకి వీసీ కావాలనుకుంటున్నట్లు తన స్నేహితుడైన బఘేలాకు శుక్లా తెలిపాడు. ఎవరైన సీనియర్ అధికారులు చెబితే తన పని సులభమవుతుందని చెప్పాడు. ఈ క్రమంలో తమ పని సులభంగా అవుతుందనుకుని మధ్యప్రదేశ్ గవర్నర్కు అమిత్ షా, ఆయన పీఏనంటూ వీరిద్దరూ ఫోన్ చేసి వీసీ పదవి కోసం మాట్లాడారని తెలిపారు.