అభినందన్ విడుదలపై యడ్యూరప్ప కామెంట్స్..ఏమన్నారంటే..?
కొద్ది రోజుల క్రితం భారత్ యుద్ధానికి వెళ్లడం వల్ల కర్నాటకలో అత్యధికంగా ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగిన యడ్యూరప్ప.... తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను విడుదల చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని మోడీ హెచ్చరించడంతోనే పాకిస్తాన్ యుద్ధఖైదీగా పట్టుబడ్డ పైలట్ను రిలీజ్ చేసిందనే వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో లోక్సభ స్థానాలపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశాలపై యడ్యూరప్ప ఈ కామెంట్స్ చేశారు. అభినందన్ విడుదల కాబోతున్నారని, అతని ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని చెప్పిన యెడ్డీ... శత్రువుల చేతులకు చిక్కగానే తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను మింగేశాడని ఒక యుద్ధ వీరుడు చేయాల్సిందంతా చేశాడని చెప్పారు. ఇలా చేసి తన దేశం పట్ల తనకున్న భక్తిని అభినందన్ చాటుకున్నాడని వెల్లడించారు యడ్యూరప్ప.
నరేంద్రమోడీ చర్యలతోనే పాకిస్తాన్ పై ఒత్తిడి వచ్చి అభినందన్ను విడుదల చేశారని వెల్లడించిన యడ్యూరప్ప ఇప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరై పోయిందని అన్నారు. చైనా కూడా పాక్కు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. గత 40 ఏళ్లలో భారత్ పాక్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడం ఇదే తొలిసారని అన్నారు. ఇలా వెళ్లారంటే ప్రధాని నరేంద్ర మోడీ భారత బలగాలకు పూర్తి అధికారాలు ఇవ్వడంతోనే జరిగిందని యడ్యూరప్ప అన్నారు. పాకిస్తాన్ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు వెళ్లి అక్కడి జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చాయని యడ్యూరప్ప చెప్పారు. ఆ తర్వాత పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చినప్పటికీ మన దళాలు తిప్పి కొట్టాయని చెప్పిన యడ్యూరప్ప... ప్రధాని సత్తా ఏంటో ప్రపంచదేశాలకు తెలిశాయన్నారు. ఈ క్రమంలోనే మోడీ పై ప్రపంచదేశాలకు మరింత గౌరవం పెరిగిందన్నారు.