తొలి రాఫెల్ యుద్ధ విమానంను అందుకున్న భారత వాయుసేన
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించే క్రమంలో రాఫెల్ యుద్ధవిమానాల అంశాన్ని అస్త్రంగా ఉపయోగించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే విరుచుకుపడ్డారు. ఇక ఆ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ దేశం నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం భారత్కు చేరుకుంది. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న డిప్యూటీ ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరీ ఈ యుద్ధ విమానంను అందుకున్నారు.
మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం ఫ్రాన్స్తో కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి దీనిపై వివాదాలు నడుస్తున్నాయి. రోజుకో వివాదం తలెత్తుతుండటంతో బీజేపీకి ఆ సమయంలో రాఫెల్ వ్యవహారం తలనొప్పింగా మారింది. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావించిన భారత్... తొలి యుద్ధ విమానంను భారత్కు అప్పగించింది ఫ్రాన్స్. ఇక విమానం టెయిల్ నెంబర్ ఆర్బీ-01 అని ఇచ్చారు. ఆర్బీ అంటే ఎయిర్మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా పేరు వచ్చేలా ఇచ్చారు.
ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, కొత్త ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్గా నియమితులయ్యారు. రాఫెల్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు యుద్ధవిమానంను నడిపిన తొలి ఐఏఎఫ్ బృందంలో ఈయనొకరుగా ఉన్నారు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో అధికారికంగా అక్టోబర్ 8న చేరనుంది. ఆ సమయంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ పర్యటనకు వెళతారు. అయితే మే 2020లో మాత్రమే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకుంటాయి. అప్పటిలోగా దీని పనితీరు, వినియోగంపై పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానంను నడపడంలో కొంతమంది పైలట్లు శిక్షణ పొందారు. మొత్తంగా మే 2020 నాటికి 24 మంది పైలట్లకు మూడు బృందాలుగా విడగొట్టి శిక్షణ ఇవ్వనుంది.
రాఫెల్ యుద్ధ విమానాలను ఒక స్క్వాడ్రాన్ను హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్లో ఉంచుతుంది. మరో స్క్వాడ్రాన్ యుద్ధవిమానాలను పశ్చిమ బెంగాల్లోని హషిమరా ఎయిర్బేస్లో ఉంచుతుంది. సెప్టెంబర్ 2016లో భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వంల మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. దీని విలువ 7.8 బిలియన్ యూరోలు.