కూలిన మిగ్.. సరిహద్దులకు సమీపంలో ఘటన: మూడునెలల్లో తొమ్మిదోసారి
జోధ్ పూర్: పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో కలకలం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 11: 45 గంటల సమయంలో.. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిగ్ 27 కుప్పకూలింది. పాకిస్తాన్ సరిహద్దు జిల్లా రాజస్థాన్ లోని జోధ్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలే ఈ ప్రమాదానికి కారణమని భారత వైమానిక దళ అధికారులు చెబుతున్నారు. అంతకుమించి ఆందోళన పడాల్సిన సంఘటనలేవీ ఈ ఘటనకు కారణం కాదని స్పష్టం చేస్తున్నారు.
పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్: రెండు నెలల్లో రెండో ప్రమాదం
జోధ్ పూర్ కు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరోహి ప్రాంతంలోని గోడానా గ్రామ శివార్లలో ఈ ఉదయం మిగ్ 27 కుప్పకూలింది. పైలెట్ సురక్షితంగా ఉన్నట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలెట్.. పారాష్యూట్ సహాయంతో నేలకు దిగినట్లు తెలిపారు. సరిహద్దు వెంబడి రోజువారీ తనిఖీలో భాగంగా.. మిగ్-27 యూపీజీ విమానం జోధ్ పూర్ నుంచి బయలుదేరిన కాసేపటికే కుప్ప కూలినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వైమానిక దళ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
1980లో మిగ్ 27 యుద్ధ విమానాలను మనదేశం.. అప్పటి సోవియట్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. అప్పటి నుంచీ ఇవి మనదేశ వైమానిక దళంలో ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. 1999 నాటి కార్గిల్ యుద్ధ సమయంలో మిగ్ 27 సేవలను విస్తృతంగా వినియోగించుకున్నారు. ఈ మూడు నెలల కాలంలో వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కుప్పకూలిపోవడం ఇది తొమ్మిదోసారి కావడం అధికారుల్లో ఆందోళనకు దారి తీసింది.