అభినందన్.. పాక్ చేతికి చిక్కడానికి వైమానిక దళ తప్పిదాలే కారణమా?
Recommended Video
న్యూఢిల్లీ: భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్..శతృదేశం పాకిస్తాన్ చేతికి చిక్కడానికి మనదేశమే పరోక్షంగా కారణమైందా? యుద్ధ సైనికుడిగా పాకిస్తాన్ జవాన్ల చేతికి చిక్కిన అభినందన్.. వెంటనే విడుదల కావడం హర్షణీయమే అయినప్పటికీ.. ఆయన వారి చేతికి చిక్కడానికి మనదేశ వైమానిక దళ వైఫల్యమే కారణమా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్నప్పటికీ.. దీనికి అనుగుణంగా సాంకేతిక పరిజ్నానాన్ని అందిపుచ్చుకోలేపోవడం వల్లే అభినందన్.. పాకిస్తాన్ సైన్యం చేతికి దొరికారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను చేస్తోంది కూడా వాయుసేన మాజీ ఉన్నతాధికారులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పుల్వామా దాడులతో సెకెండ్ సర్జికల్ స్ట్రైక్..
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహూతి దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు అయ్యారు. దీనికి ప్రతీకారంగా అదే నెలలో మనదేశ సైన్యం పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ ను నిర్వహించింది. పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి.. అక్కడి బాలాకోట్ లో వెలసిన జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడికి దిగింది. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే- పాకిస్తాన్ వాయుసేన కూడా జమ్మూ కాశ్మీర్ లో భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చింది. మనదేశ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించింది. అదృష్టవశావత్తూ అవి గురి తప్పాయి.
పొరపాటున గగనతల హద్దులు దాటిని వింగ్ కమాండర్..
ఈ సందర్భంగా అభినందన్ వర్తమాన్.. మిగ్ - 21 ద్వారా పాకిస్తాన్ వాయుసేనకు చెందిన ఎఫ్- 16 యుద్ధ విమానాన్ని వెంటాడుతూ వెళ్లారు. మనదేశ గగనతలం మీది నుంచి దాన్ని తరిమి కొట్టారు. అనుకోకుండా ఆయన పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడం, ఆ తరువాత ఆయన నడిపిన యుద్ధ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తి, పారాషూట్ సహాయంతో అభినందన్ పాక్ గడ్డపై అడుగు పెట్టడం, ఆ దేశ సైన్యానికి చిక్కడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే తాజాగా కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పాకిస్తాన్ యుద్ద విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన అభినందన్.. పొరపాటున మనదేశాన్ని దాటుకుని పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడంపై వైమానిక దళ అధికారులు చేసిన హెచ్చరికలు ఆయన ఎందుకు అందుకోలేకపోయారనే విషయం తాజాగా చర్చనీయాంశమైంది.
పాక్ వద్ద అత్యాధునిక జామర్ల వ్యవస్థ..
పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన విషయాన్ని గుర్తించిన వెంటనే మనదేశ వైమానిక దళాలు అభినందన్ కు ప్రమాదకర సంకేతాలను పంపించాయి. వెనక్కి తిరిగి రావాల్సిందిగా సూచించాయి. దీనికి సంబంధించి వారు.. ప్రత్యేక సమాచార వ్యవస్థ ద్వారా అభినందన్ తో మాట్లాడటానికి ప్రయత్నించారు. అక్కడే ఇబ్బందులు నెలకొన్నాయి. పాకిస్తాన్ సైన్యం ఏర్పాటు చేసిన జామర్ల ద్వారా భారత వైమానిక దళ కమ్యూనికేషన్ల వ్యవస్థ స్తంభించిపోయింది. పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన మరుక్షణమే మనదేశ వైమానిక దళ కమ్యూనికేషన్ల వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. దీనికి కారణం పాకిస్తాన్ ఏర్పాటు చేసిన అత్యాధునిక జామర్ల వ్యవస్థే. దీనితో- అభినందన్ చిక్కుల్లో పడక తప్పలేదు.
యాంటీ జామింగ్ వ్యవస్థ కోసం పోరాడుతున్నా..
భారత వైమానిక దళంలో యాంటీ జామింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ చాలాకాలం నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. వాయుసేన ఈ దిశగా పెద్దగా దృష్టి సారించిన సందర్భాలు లేవు. అత్యాధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ భారత వైమానిక దళం తొలిసారిగా 2005లో ప్రతిపాదనలను కేంద్రానికి పంపించింది. 2008 నుంచి 2012 వరకు వాయుసేన.. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ప్రయోగాత్మక పరిశీలించి చూసింది. పంజాబ్ లోని హాల్వేర్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన పరీక్షలను 2013లోనే చేపట్టింది. డీఆర్డీఓ, బీఈఎల్ సంస్థలు వైమానిక దళ కమ్యూనికేషన్ల వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బిడ్లను సైతం దాఖలు చేశాయి. అవి కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా- 2005 కంటే ముందునాటి కమ్యూనికేషన్ల వ్యవస్థనే మనదేశ వైమానిక దళం వినియోగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.