డికే రవి కేసు: వేగం పెంచని సీబీఐ అధికారులు
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే.రవి అనుమానాస్పద మృతి కేసు ఒక కొలిక్కి వచ్చిందని సీబీఐ అధికారులు అంటున్నారు. అయితే కేసు దర్యాప్తు అనుకున్నంత వేగంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేసు దర్యాప్తు నత్తనడకన జరుగుతున్నదని స్పష్టంగా కనపడుతున్నది.
ఐఏఎస్ అధికారి డికే రవి ఆత్మహత్య చేసుకున్నాడని సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని ఆ వర్గాలు అంటున్నాయి. సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు కోణాలలో దర్యాప్తు చేశారు.
సీబీఐ విభాగం సీనియర్ అధికారి ఉమేష్ దత్త, ఎస్పీ కృష్ణమూర్తి ఆద్వర్యంలో బెంగళూరు, తుమకూరు, కోలారు తదితర చోట్ల విచారణ చేశారు. రవి తల్లిదండ్రులు, సోదరుడు, రవి భార్య కుసుమా, మామ హనుమంతరాయప్ప, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి తదితరులను విచారణ చేశారు.
అదే విధంగా రవి పని చేస్తున్న వాణిజ్య పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది, కారు డ్రైవర్ ఎళంగోవన్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. రవి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించిన విక్టోరియా ఆసుపత్రి వైద్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు.
రవి మొబైల్, ల్యాప్ టాప్, ఐ ప్యాడ్ ను పరిశీలించారు. అందులోని వేలాధి మెసేజ్ లు పరిశీలించారు. రవి చివరి సారిగా పంపించిన మేసేజ్ ఆదారంగా ఒక మహిళ ఐఏఎస్ అధికారిని విచారణ చేసి వివరాలు సేకరించారు. రవి మృతదేహానికి మళ్లి పోస్టుమార్టుం నిర్వహించాలని సీబీఐ అధికారులు భావించారు.