ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్య!
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి ఆత్మహత్య వెనుక ఎవరి హస్తం లేదని, ఎవరు బెదిరించలేదని, ఆయనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది. తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అప్పగించడానికి సీబీఐ అధికారులు సిద్దం అవుతున్నారు.
ఐఏఎస్ అధికారి రవి అనుమానస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు బెంగళూరు నగరంతో పాటు, కోలారు, తుమకూరు జిల్లాలలో దర్యాప్తు చేశారు.
గతంలో కేసు దర్యాప్తు చేసిన సీఐడీ అధికారుల నివేదికను పరిశీలించారు. విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక, ఎస్ఎఫ్ఎల్ నివేదిక, డీకే రవి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ మేసేజ్ లు పరిశీలించి వివరాలు సేకరించారు.
అదే విధంగా రవి కుటుంబ సభ్యులు, ఆయన పని చేసిన చోట ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరించారు. రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవ్వరు ఆత్మహత్యకు ప్రేరేపించలేదని సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
అంతేకాకుండా డీకే రవికి ఎవరూ బలవంతంగా ఉరి వెయ్యలేదని, గొంతు నులిమి హత్య చెయ్యలేదని సీబీఐ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. అదే విధంగా ఏఐఎంఎస్ నివేదికలో రవి ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది. జులై నెలలో సీబీఐ అధికారులు దర్యాప్తు నివేదిక అందజేస్తారని సమాచారం.