మాట్లాడే స్వేచ్ఛే లేదు: జమ్మూకాశ్మీర్ ఆంక్షలపై ఐఏఎస్ అధికారి ఆవేదన, రిజైన్
తిరువనంతపురం: మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోతే తనకు ఈ అధికారం ఎందుకంటూ 33ఏళ్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి కన్నన్ గోపీనాథన్ తన వృత్తికి రాజీనామా చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిని రద్దు చేసి ఆ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారని పేర్కొన్నారు.
దాద్రానగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కన్నన్.. తనను రిలీవ్ చేయాలంటూ హోం సెక్రటరీకి లేఖ రాశారు. తాను ఏ ఉద్దేశంతో విధుల్లో చేరానో వాటిని అమలు చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. గొంతు లేని వారికి తాను గొంతుక కావాలని అనుకున్నానని.. అయితే ఇప్పుడు తన గొంతును కూడా విప్పే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని, అది లేకుండా తాను విధుల్లో కొనసాగలేనని గోపీనాథ్ కన్నన్ స్పష్టం చేశారు. అయితే, ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిం కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో తన భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపర్చలేకపోయాననే ఆవేదన తనను తొలిచేస్తోందని కన్నన్ పేర్కొన్నారు.
తన భార్య చాలా మంచిదని, తన అభిప్రాయాలను గౌరవిస్తుందని గోపీనాథ్ కన్నన్ తెలిపారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి లక్షలాది మంది జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను కాలరాసినా.. భారత ప్రజలు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
బాధ్యత గల ఐఏఎస్గా పేరు..
గత సంవత్సరం కేరళలో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో దాద్రానగర్ హవేలీ కలెక్టర్ విధులు నిర్వహిస్తూ.. ఒక సామాన్యుడిలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోటి అధికారి ఆయనను కలెక్టర్ అని గుర్తించే వరకు కూడా ఆయన ఎవరో తెలియకపోవడం గమనార్హం. ఆ తర్వాత గోపీనాథ్ కన్నన్ సేవా భావానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ప్రధాన మంత్రి ఎక్స్లెన్స్ అవార్డుకు దరఖాస్తు చేయకపోవడంపై ఈయనకు మెమోలు రావడం గమనార్హం.