ఐఏఎస్ రవి మృతి: హైకోర్టుకు లేఖ, విపక్షాల ఆందోళన
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టు రిజిస్టార్కు తుమకూరుకు చెందిన మదుసూధన్ అనే వ్యక్తి బుధవారం లేఖ రాశారు.డి.కే. రవి చావు వెనుక మాఫియా హస్తం ఉందని, కర్ణాటక హొం శాఖ మంత్రి జార్జ్ ప్రమేయం ఉందని లేఖలో ఆరోపించారు.
డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ ఎంఎల్ఏలు డిమాండ్ చేస్తూ బుధవారం శాసన సభ సమావేశాలలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. శాసన సభ సమావేశాలు పలుమార్లు వాయిదా వేసినా ప్రతిపక్ష నాయకులు మాత్రం వెనక్కు తగ్గలేదు.
సీఎం సిద్దరామయ్య, హొం శాఖ మంత్రి జార్జ్లను ప్రతిపక్షాల సభ్యులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కాగా, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మదుసూధన్ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు. తను రాసిన లేఖను ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా (పిల్గా) స్వీకరించాలని మనవి చేశారు.
రవి కేసు దర్యాప్తులో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోరాదని, కేసు దర్యాప్తు నీరు కానివ్వకుండ చూడాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగరంలో ధర్నాలు నిర్వహించారు. బుధవారం చిక్కబళ్లాపురంలో బంద్ నిర్వహించి ఐఏఎస్ అధికారి రవికి నివాళులు అర్పించారు. బంద్ ప్రశాంతంగా జరిగింది.