సీబీఐతో దర్యాప్తు: ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్
బెంగళూరు: సిన్సియర్ గా పని చేస్తు ఎందరికో ఆదర్శంగా నిలిచిన డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంపై లేఖ రాసింది. ఎలాంటి పరిస్థితులలో రవి కుటుంబ సభ్యులకు అన్యాయం జరకుండ చూడాలని, అవసరమైతే పోరాటం చేద్దామని ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
డి.కే. రవిని తాము దగ్గర నుండి చూశామని, ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చిన ఆయనకు ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం లేదని సాటి ఐఏఎస్ అధికారులు అంటున్నారు. సీబీఐతో దర్యాప్తు చేయించే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని వారు నిర్ణయించారు. సీబీఐతో దర్యాప్తు జరిపించకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రవి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు స్థానికులు (కర్ణాటకకు చెందిన వారు) కావడం వలన వారి మీద ఏదో ఒక విదంగా ఒత్తిడి ఉండే ప్రమాదం ఉందని అన్నారు. అందు వలన రాష్ట్రానికి సంబంధం లేని సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు.
కర్ణాటక రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం రవి విషయంలో స్పందించడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. అయితే ఆల్ ఇండియా ఐఏఎస్ అధికారుల సంఘం మాత్రం రవి కుటుంబానికి న్యాయం జరగాలని. ఇంకోక ఐఏఎస్ అధికారికి ఇలాంటి పరిస్థితి రాకూడదని బావిస్తున్నారు. రవి కేసు సీబీఐకి అప్పగించాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు మదన్ గోపాల్, రశ్మి మహేష్, హర్ష గుప్తా, మణివణ్ణన్ తదితరులు ఇప్పటికే బహిరంగంగా డిమాండ్ చేశారు.