ప్రేమలో పడ్డ ఐఎఎస్ అధికారులు.. ప్రేమికుల రోజునే పెళ్లి
బెంగళూరు : ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండే ఐఎఎస్ అధికారులు ప్రేమలో పడ్డారు. ప్రేమికుల రోజునే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 2008లో సివిల్స్ పరీక్షల్లో నేషనల్ లెవెల్లో 23వ ర్యాంక్ సాధించారు. 2009 కర్ణాటక బ్యాచ్ ఐఎఎస్ అధికారిగా కొనసాగుతున్నారు.
దావణగెరె జిల్లాలోనే పనిచేస్తున్న ఐఎఎస్ అధికారిణి అశ్వథితో ప్రేమలో పడ్డారు గౌతం. జిల్లా పరిషత్ కార్యాలయం సీఈవో గా పనిచేస్తున్న అశ్వథి.. కేరళకు చెందినవారు. విధినిర్వహణలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరిద్దరు పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఇరువురి కుటుంబాల పెద్దలను ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. మరో ఐఎఎస్ అధికారి వీరి ప్రేమకు అండగా నిలిచి.. కుటుంబ సభ్యులతో పెళ్లికి ఓకే చెప్పించారు.
ఈనెల 14న వచ్చే ప్రేమికుల రోజున వీరి వివాహ జరగనుంది. కేరళలోని కాలికట్ లో ఈ ఇద్దరు ప్రేమికులు ఒక్కటి కానున్నారు. 17వ తేదీన గౌతం స్వగ్రామంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.