ఐఏఎస్ డికే రవి కేసు: ఎయిమ్స్ బృందం
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల సహకారం తీసుకుని దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం సీనియర్ అధికారి సుధీర్. కే. గుప్తా నేతృత్వంలోని ప్రత్యేక బృందం వైద్యులు బెంగళూరు చేరుకుని సీబీఐ అధికారుల దర్యాప్తునకు సహకరించనున్నారు. డి.కే. రవి ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికే లభ్యం అయిన అన్ని సాక్షాలను ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలించనుంది.
డి.కే. రవి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐడి అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. తరువాత సీబీఐ అధికారుల దర్యాప్తులో ఇదే విషయం వెలుగు చూసింది. అయితే రవి ఆత్మహత్య చేసుకున్న సమయంలో సేకరించిన వీడియోగ్రఫి సాక్ష్యాలు, సంఘటనా స్థలాన్ని ఎయిమ్స్ బృందం పరిశీలించనుంది.
రవి మృతదేహం మీద గుర్తించిన గాయం ఎప్పుడు అయ్యింది, ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు గాయం అయ్యిందా, రవి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోస్టుమార్టం నివేదికలో కచ్చితంగా వెలుగు చూసిందా అని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చెయ్యనున్నారు.
డికే. రవి అనుమానాస్సద మృతి కేసు విషయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. సీబీఐ అధికారులు దాదాపు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. చివరిసారిగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.