తెలుగు అధికారికి అమెరికాలో బాధ్యతలు.. కీలక తరుణంలో మోదీ అనూహ్య నిర్ణయం..
కరోనా కారణంగా ప్రపంచమంతటా సంక్షోభం నెలకొన్న తరుణంలో.. విదేశాల్లో.. మరీ ముఖ్యంగా అమెరికాలో భారత్ కు సంబంధించిన వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు ఐఏఎస్ అధికారి రవి కోటకు కీలక పదవి కట్టబెట్టారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా రవి నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకనమిక్ మినిస్టర్గా ఆయన విధులు నిర్వహించనున్నారు.
మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి కోట.. భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట.. 1993 బ్యాచ్ అసోం క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. గత రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. మరోవైపు..
ప్రధాని కార్యాలయంలో కీలక వ్యక్తిగా, మోదీకి ప్రైవేట్ కార్యదర్శిగా కొనసాగుతోన్న రాజీవ్ టోప్నోకు ప్రపంచ బ్యాంకులో కీలక పదవి దక్కింది. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్కు సీనియర్ సలహాదారుగా ఆయనను నియమించారు.
Recommended Video
1974 మే 28న రాజీవ్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జన్మించారు. 1996 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ మన్మోహన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. మోదీ టీమ్ లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. పీఎంవోకే చెందిన మరో సీనియస్ ఆఫీసర్ భజేంద్ర నవనీత్ ను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)కు బదిలీ చేశారు. డబ్ల్యూటీవోలో భారత శాశ్వత మిషన్ కు ఆయన అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.