కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరం
న్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే తీవ్రవాదాన్ని ఖండించాలని చెప్పారు. తీవ్రవాదాన్ని ఖండించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదిని తీవ్రవాదిగా చూడాలని వ్యాఖ్యానించారు.
అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడు
అంతకుముందు, దీనిపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. తోటి పౌరులే ఈ వ్యాఖ్యలు చేయడంతో మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. షా పైసల్ రాజీనామా చేయడం విచారకరమేనని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఫైసల్ చెప్పిన ప్రతి మాటా వాస్తవమే అన్నారు. ఆయన వేదనను యావత్ ప్రపంచం గుర్తిస్తోందన్నారు.
కొద్దిరోజుల క్రితం పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబెరో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని, తోటి పౌరులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని చిదంబరం అన్నారు.
కాగా, ఐఏఎస్ టాపర్ షా ఫైసల్ (35) బుధవారం రాజీనామా చేశారు. విదేశాల్లో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే భారత్కు తిరిగి వచ్చిన ఆయన ప్రస్తుతం పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు. రాజీనామా విషయాన్ని బుధవారం ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
కాశ్మీర్లో హత్యాకాండ కొనసాగుతోందని, వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయడం లేదని, తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారని, వీటన్నింటిపై పోరాడేందుకు వీలుగా సివిల్ సర్వీస్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని ఫైసల్ పేర్కొన్నారు.