నాగార్జున సాగర్, శ్రీశైలం: డ్యాంలకు ఐబీ హెచ్చరిక
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇంటెలిజన్స్ బ్యూరో (ఐబీ) దేశవ్యాప్తంగా అన్ని డ్యాంలకు, పోర్టులకు హెచ్చరికలు జారి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డ్యాంలకు తగిన భద్రత కల్పించాలని హెచ్చరించింది. తీవ్రవాదులు దాడులు చేసే అవకాశాలున్నాయని ఐబీ ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని డ్యాంలకు కూడా తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలకు తగిన భద్రత కల్పించాలని చెప్పింది. అలాగే విశాఖ పోర్టుకు కూడా ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాదులో తనిఖీలు
నేరాల నియంత్రణలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్లో పోలీసులు కార్డ్ అండ్ సెర్చ్కు శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని మల్లేపల్లి మాంగార్ బస్తీ ప్రాంతాన్ని దిగ్బంధించి ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 24 బృందాలుగా విడిపోయిన 350 మంది పోలీసులు అణువణువు జల్లెడ పట్టారు. మొత్తం 56 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా పాతనేరస్థుల స్థావరాలను గుర్తించిన పోలీసులు కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువగా మహిళా దొంగలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే వారు ఉన్నారు.