ఐబీఎమ్ ఇండియా: త్వరలో 5 వేల మందికి ఉద్వాసన..!
హైదరాబాద్: అంతర్జాతీయ సాప్ట్వేర్ కంపెనీ ఐబీఎమ్ రాబోయే నెలల్లో ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. భారత్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న దాదాపు 5 వేల మందిని తొలిగించేందుకు కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
పెరిగిన మార్జిన్ ఒత్తిళ్లు, పెరుగుతున్న ఆదాయం, క్లౌడ్ కంప్యూటింగ్ను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఐబీఎమ్ ఈ చర్యలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐబీఎమ్లో సుమారు 3,98,455 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపులు ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎమ్ సంస్ధలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కన్సల్టింగ్ సర్వీసులతో సహా అన్ని విభాగాల్లో ఉండొచ్చని తెలుస్తోంది.
సోమవారం సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ కాలమిస్ట్ రాబర్డ్ ఇందుకు సంబంధించి ఫోర్బ్స్లో ఆర్టికల్ను ప్రచురించారు. దీంతో ఐబీఎమ్కు చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పోరేషన్ ప్రతినిధి ఈ ఉద్యోగుల తొలగింపుపై వ్యాఖ్యానించేదుకు నిరాకరించారు.
ఐబీఎమ్ ఇండియా అకౌంట్ కింద 1.3 లక్షల మంది విధులను నిర్వహిస్తున్నారు. ఐటీ స్టాఫ్ను నియమించుకునేందుకు గాను ఐబీఎమ్ ఏడాదికి 150 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుంది. అదే కాంట్రాక్ట్ పరిధిలో ఉద్యోగులను తీసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చనే భాగంలోనే ఈ తొలగింపు చర్యలు చేపట్టిందని తెలుస్తోంది.
ఇక ఐబీఎమ్ కంపెనీకి మూడో వంతు ఆదాయం విదేశాల నుంచే వస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా దేశాల్లో ఐబీఎమ్ విస్తృతంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది.