ఫ్రాడ్ కేసుల్లో.. ఐసీఐసీఐ బ్యాంక్ టాప్! ఉద్యోగులంపై 3.870 కేసులు!
ఫ్రాడ్ జరిగిన మొత్తం డబ్బు పరంగా చూస్తే రూ.2,236.81 కోట్లతో ఎస్బీఐ మొదటి స్థానంలో నిలవగా, రూ.2,250.34 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, రూ.1,998.49 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ లు రెండు,
న్యూఢిల్లీ: 2016లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఆయా బ్యాంకుల్లో నమోదైన ఫ్రాడ్ కేసుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
2016లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 9 నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచిలలో మొత్తం 455 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 429 కేసులు నమోదు కాగా, 244 కేసులతో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, 237 కేసులతో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక ఆ తరువాత స్థానాల్లో వరుసగా యాక్సిస్ బ్యాంక్(189 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడా(176 కేసులు), సిటీ బ్యాంక్ (150 కేసులు) ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి.
ఫ్రాడ్ జరిగిన మొత్తం డబ్బు పరంగా చూస్తే రూ.2,236.81 కోట్లతో ఎస్బీఐ మొదటి స్థానంలో నిలవగా, రూ.2,250.34 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, రూ.1,998.49 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఉద్యోగుల పరంగా చూస్తే ఎస్బీఐ అన్ని శాఖల్లో కలిపి మొత్తం 64 మంది ఉద్యోగులు ఫ్రాడ్ కేసుల్లో భాగస్వాములయ్యారు. అదే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో అయితే 49 మంది ఉద్యోగులు ఫ్రాడ్ కు పాల్పడగా, యాక్సిస్ బ్యాంక్ లో 35 మంది ఉద్యోగులు ఫ్రాడ్ కు పాల్పడ్డారు.
మొత్తంగా అన్ని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లోనూ 450 మంది ఉద్యోగులు 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మోసాలకు పాల్పడగా, ఆ మొత్తం డబ్బు విలువ రూ.17,750.27 కోట్లుగా తేలింది. ఫ్రాడ్ కు పాల్పడిన ఉద్యోగులందరిపై 3.870 కేసులు నమోదైనట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.