కరోనాపై వ్యూహం మార్చిన ఐసీఎంఆర్- ఇక అడగ్గానే టెస్టులు- కొత్త మార్గదర్శకాల విడుదల...
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఎన్ని కేసులు నియంత్రిస్తున్నారో దాదాపు అన్ని, లేదా అంతకు మించి కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాల వైఖరిత ప్రజల్లోనూ కాస్త ధైర్యం రావడంతో కరోనా వ్యాప్తి అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. దీంతో తాజాగా కరోనా కట్టడి వ్యూహంలో ఐసీఎంఆర్ మార్పులు చేసింది. ఇకపై అడగ్గానే టెస్టులు నిర్వహించేందుకు వీలుగా తన తాజా మార్గదర్శకాల్లో రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. ఇందులో రాష్ట్ర్రాలు తమ స్వయం విచక్షణ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కల్పించింది.
అడ్డూ అదుపులేని కరోనా..
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. రెండు నెలల క్రితం నమోదైన కేసులకూ తాజా కేసులకూ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోయింది. అంతెందుకు గత 13 రోజుల్లోనే దేశంలో 10 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల పైనా ఒత్తిడి పెరుగుతోంది. కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్యసంస్ధతో పాటు ఐసీఎంఆర్ విధించిన మార్గదర్శకాలు పాటిస్తున్నట్లు అందరూ పైకి చెప్పుకుంటున్నా అంతర్గతంగా మాత్రం దీన్ని లైట్ తీసుకున్నట్లు పరిస్ధితి చూస్తే అర్ధమవుతుంది. తాజాగా దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటి పోయింది. ఆగస్టు 7న 20 లక్షలు దాటిన కేసులు 23 నాటికి 30 లక్షలు దాటగా.. తాజాగా ఇది 40 లక్షల మార్క్ దాటిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చూసినా కరోనా కేసులు, మృతుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్ధానంలో ఉంది.
ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు..
దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఎప్పటికప్పుడు కొత్త మార్దదర్శకాలు విడుదల చేస్తున్న ఐసీఎంఆర్ తాజాగా మరోమారు కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటితో పాటు మరికొన్ని అనుమతులు కూడా ఇచ్చింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రతీ ఒక్కరినీ కరోనా నెగెటివ్ వచ్చాకే అనుమతించాలని రాష్ట్రాలకు సూచించింది. ఎంట్రీ పాయింట్లలోనే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరింది. దీంతో పాటు కరోనా టెస్టుల నిర్వహణ విధానాన్ని కూడా సరళీకరించాలని తెలిపింది. కంటైన్ మెంట్ జోన్లలో నివసించే వందశాతం ప్రజలకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించి తీరాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా టెస్టు జరగలేదన్న కారణంతో ప్రసవాలతో పాటు ఇతర ఎమర్జెన్సీలను ఆలస్యం చేయొద్దని కూడా ఐసీఎంఆర్ సూచించింది. ఓసారి కరోనా నిర్ధారణ అయిన తర్వాత 5 నుంచి 10 రోజుల్లోపు మరోసారి పరీక్షించాలని కోరుతోంది.
కరోనా టెస్టులు ఆన్ డిమాండ్..
ఇకపై కరోనా టెస్టులను బాధితులు కోరిన వెంటనే నిర్వహించేలా పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచనలు చేసింది. గతంలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తేనా టెస్టులు చేయాలనే ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిబంధనలు పాటిస్తుండగా.. ఇప్పుడు లక్షణాలతో సంబంధం లేకుండా ఆన్ డిమాండ్ టెస్టులకు అవకాశం కల్పించాలని ఐసీఎంఆర్ సూచించింది. అదే సమయంలో ఆన్ డిమాండ్ టెస్టులపై నిర్ణయాధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టింది. మరోవైపు కరోనా టెస్టుల్లో ప్రయారిటీ ఎలా ఉండాలన్న దానిపైనా ఐసీఎంఆర్ పలు సూచనలు చేసింది. కరోనా టెస్టుల్లో ఫస్ట్ ప్రయారిటీగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, ఆ తర్వాత ఆర్టీ-పీసీఆర్ లేదా ట్రూనాట్ లేదా సీబీనాట్ టెస్టులు ఉండాలని తెలిపింది.