ఇండియాలో కోటి దాటిన కరోనా పరీక్షలు .. వెల్లడించిన ఐసీఎంఆర్
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రపంచంలోనే మూడో స్థానానికి ఇండియా చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో బ్రెజిల్ ఉండగా, కరోనా కేసులలో మూడవ స్థానంలో ప్రస్తుతం భారత్ చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 24,248 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. ఇక టెస్టుల విషయానికి వస్తే ఇండియా మరింత సామర్ధ్యాన్ని పెంచనుంది.
కరోనా వ్యాక్సిన్ తయారీపై నీలినీడలు .. ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ రానట్టేనా?
కోటి దాటిన కరోనా పరీక్షలు
భారత్లో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య కోటి దాటినట్లుగా తెలుస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐ సి ఎం ఆర్ చేసిన ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు గా వెల్లడించింది. భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం ఒక కోటి నాలుగు వేల నూట ఒక్క టెస్ట్ లను నిర్వహించామని, మొత్తం ప్రైవేటు, ప్రభుత్వ లేబరేటరీలలో కలిపి నిర్వహించిన టెస్ట్ ల లెక్క ఇది అని పేర్కొంది.
దేశ వ్యాప్తంగా 1105 ల్యాబ్ లలో కరోనా పరీక్షలు
అంతేకాకుండా దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం 788 ప్రభుత్వ ల్యాబ్ లు , 317 ప్రైవేట్ ల్యాబ్ లు పనిచేస్తున్నాయని, మొత్తంగా 1105 ల్యాబ్ లలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఐసిఎంఆర్ ప్రకటించింది.గడిచిన 14 రోజుల నుండి ప్రతిరోజూ సరాసరి రెండున్నర లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఐసీఎంఆర్ ప్రకటనలో పేర్కొంది. కరోనా వైరస్ ఉన్నవారిని గుర్తించడానికి, వారికి పరీక్షలు నిర్వహించి, వైద్య సదుపాయం అందించటానికి రాష్ట్రాలు పనిచేయాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఐసీఎంఆర్ పేర్కొంది.
ప్రతిరోజు మూడు లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు చెయ్యనున్నామన్న ఐసీఎంఆర్
రానున్న రోజుల్లో పరీక్షల సామర్థ్యాన్ని కూడా పెంచుతామని, ప్రతిరోజు మూడు లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఏపీలోనూ ఒక మిలియన్ కరోనా టెస్టులు పూర్తయ్యాయి. ఇక నిన్నటి వరకు దేశంలో మొత్తం 99,69,662 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 1,80,596 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
7 లక్షలకు చేరిన కేసులు .. టెస్టులలోనూ ఇండియా మార్క్
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,97,413 చేరగా, నిన్న ఒక్క రోజే 25 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతోమృతుల సంఖ్య మొత్తం 19,693కి పెరిగింది. 2,53,287 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,24,433 మంది కోలుకున్నారు. ఒకపక్క కేసులు విపరీతంగా పెరుగుతున్నా, మరోపక్క టెస్టులలో కూడా కోటి మార్కు దాటి భారత్ ప్రజలకు వైద్య పరీక్షలను అందిస్తుంది .