కరోనా విలయం: భారత్ స్టేజ్-3లో ఉందా? ఐసీఎంఆర్ కీలక సర్వే.. ఏపీ, తెలంగాణలో మూడేసి జిల్లాల్లో..
దేశంలో లాక్ డౌన్ విధించి 50 రోజులు పూర్తయినా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. అందులో 22,454 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2293 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008గా ఉంది. అయితే, గడిచిన వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య భయానకంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. సోమవారం రికార్డు స్థాయిలో 4వేల పైచిలుకు కొత్త కేసులు రాగా, మంగళవారం కూడా కొత్తగా 3,604 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా బయటపడుతోన్న లెక్కలు.. భారత్ స్టేజ్-3లోకి అంటే వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశలోకి ప్రవేశించిందేమోననే అనుమానాలను బలపరుస్తున్నాయి.
దీన్ని నిర్ధారించుకోడానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కమ్యూనిటీ ఆధారిత సెరో స్వేను ప్రారంభించింది. దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ర్యాండంగా ఎంపిక చేసుకున్న 69 జిల్లాల్లో దశలవారీగా సర్వే నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) సహకారంతో చేపట్టిన ఈ సర్వేకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
నిజానికి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్(సామూహిక వ్యాప్తి) దశకు రాలేదని కేంద్రం, ఐసీఎంఆర్ బలంగా వాదిస్తూ వచ్చాయి, కానీ గడిచిన వారం రోజులుగా నమోదవుతోన్న నంబర్లు, పాజిటివ్ గా నిర్ధారణ అవుతోన్న వాళ్లలో చాలా మందికి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం లాంటి పరిణామాలతో వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. తాజా సర్వేలో భాగంగా.. కొవిడ్-19 కేసుల నమోదును బట్టి ఆయా జిల్లాల్లోని 10 క్లస్టర్ల నుంచి 400 మంది ర్యాండంగా ఎంపిక చేసి యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు చేపడతారు. అందరూ 18 ఏళ్లు పైబడిన మొత్తం 24వేల మందికి పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తి తీరుపై ఒక అంచనాకు వస్తారు.
పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తయారుచేసిన తొలి స్వదేశీ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇది కాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని జనాభా ఆధారిత సెరో-సర్వే కూడా యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ తాజా సర్వే కోసం తెలంగాణలోని కామరెడ్డి, జనగామ, నల్గొండ జిల్లాలను, ఏపీ నుంచి కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. తుది ఫలితాలను బట్టి భారత్ స్టేజ్-3లోకి ప్రవేశించింది లేనిది నిర్ధారణ అవుతుందని ఐసీఎంఆర్ భావిస్తోంది.