కరోనా చికిత్సలో ఐసీఎంఆర్ మార్పులు-ఇక ఆ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ వాడకం తగ్గింపు
భారత్ లో ప్రస్తుతం కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా చికిత్సలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐసీఎంఆర్.. తాజాగా కరోనా చికిత్సలో కొన్ని ఔషధాల వాడకాన్ని తగ్గిస్తూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో గతంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో తీవ్ర డిమాండ్ ఉన్న కొన్ని ఔషధాలు ఇకపై పరిమితంగా మాత్రమే అఁదుబాటులో ఉండబోతున్నాయి.
కోవిడ్ 19 చికిత్సలో మార్పులు
భారత్ లో ప్రస్తుతం కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సలో మార్పులు చేస్తూ ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటికే రోగులకు ఇస్తున్న కొన్ని ఔషధాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు వివిధ పరిశోధనా సంస్ధలు ఇస్తున్న సూచనలు, దేశీయంగా పరిశోధనా సంస్ధలు చేస్తున్న సూచనల్ని దృష్టిలో ఉంచుకుని ఐసీఎంఆర్ తాజాగా భారత్ లో కరోనా చికిత్సకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ కరోనా చికిత్సలో వాడుతున్న పలు ఔషధాల లభ్యత తగ్గబోతోంది.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలివే
కోవిడ్ -19 చికిత్సలో ప్రస్తుతం వాడుతున్న ప్రయోగాత్మక ఇంజెక్షన్ రెమ్డెసివిర్, రోగనిరోధక శక్తిని తగ్గించే టోసిలిజుమాబ్ వాడకాన్ని తగ్గించాలని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, లక్షణాలు ప్రారంభమైనప్పటి నుండి 10 రోజులు పూర్తి చేసిన, అనుబంధ ఆక్సిజన్ అవసరమయ్యే రోగులలో మాత్రమే రెమ్డెసివిర్ వాడకానికి అనుమతిస్తారు. అయినప్పటికీ, వెంటిలేటర్పై ఉన్న రోగులకు లేదా ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO)లో ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని అందించలేమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు రెమ్డెసివిర్ను ఐదు రోజుల వరకూ వాడొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు వాడినా ఉపయోగం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. ఎయిమ్స్, ఐసీఎంఆర్ నేతృత్వంలోని కోవిడ్-19 జాతీయ టాస్క్ ఫోర్స్ రూపొందించిన తాజా ప్రోటోకాల్, వివాదాస్పద ఔషధం రెమ్డెసివిర్ పాత్రను తగ్గించడమే కాకుండా, తేలికపాటి కేసుల చికిత్స కోసం ముందుగా సూచించిన మల్టీవిటమిన్ మాత్రల వినియోగాన్ని కూడా రద్దుచేసింది. ఈసారి ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో కరోనా స్వల్పమైనా, తీవ్రమైన కేసుల్లోనూ రోగులకు బ్లడ్ షుగర్ పరీక్ష చేయాలని ఐసీఎంఆర్ సూచించింది.
అంతకుముందు, ప్రోటోకాల్ ప్రకారం సీఆర్పీ, డీ-డైమర్, కంప్లీట్ బ్లడ్ పిక్సర్ (సీబీసీ) మూత్రపిండాల పనితీరు పరీక్ష (KFT), కాలేయ పనితీరు పరీక్ష (LFT), IL-6 స్థాయిలను పర్యవేక్షించాలని సూచించింది. దగ్గు, తేలికపాటి సందర్భాల్లో, రెండు నుండి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, క్షయ, ఇతర లక్షణాలను కూడా తెలుసుకోవాలని ఇది సూచిస్తుంది. ప్రోటోకాల్ "యాక్టివ్ క్షయ" ఉన్న వ్యక్తులను తీవ్రమైన వ్యాధి, మరణాలకు అధిక ప్రమాదం ఉన్న వర్గం కింద ఐసీఎంఆర్ చేర్చింది.
ఈ స్టెరాయిడ్స్ వాడకం తగ్గింపు
తక్కువ తీవ్రత గల కేసుల్లో, ఆక్సిజన్ అవసరం లేని రోగుల్లో, డిశ్చార్జ్ తర్వాత కొనసాగే రోజుల్లో ఇచ్చే స్టెరాయిడ్ల వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ కేసుల కారణంగా స్టెరాయిడ్స్ వాడకం ప్రోత్సహించినట్లు వివరించింది. స్టెరాయిడ్స్ మితిమీరిన వినియోగాన్ని నిరుత్సాహపరుస్తూ, మితమైన మరియు తీవ్రమైన రోగులకు సంబంధించిన ప్రోటోకాల్ "యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా ఇమ్యునోమోడ్యులేటరీ థెరపీ (స్టెరాయిడ్స్ వంటివి) చాలా ముందుగానే, ఎక్కువ మోతాదులో లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు ఇన్వాసివ్ మ్యూకోర్మైకోసిస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.