పంద్రాగస్టు నాటికి కరోనా వ్యాక్సిన్: భారత్ బయోటెక్ సన్నాహాలు.. ట్రయల్స్: ఐసీఎంఆర్ కీలక లేఖ
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను రూపుమాపడానికి అవసరమైన చర్యలు వేగవంతం అయ్యాయి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్జిన్ను వచ్చేనెల 15వ తేదీ నాటికి అందుబాటులోకి రానుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నాడు కోవ్యాక్సిన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రాథమికంగా చర్యలు చేపట్టింది.
Recommended Video
ఈ లోగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ను ముమ్మరం చేస్తోంది. దీనికోసం భారత్ బయోటెక్ యాజమాన్యానికి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ లేఖ రాశారు. క్లినికల్ ట్రయల్స్ను వేగవంతం చేయడానికి భారత్ బయోటెక్తో తాము కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా ఈ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ కోసం హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను రూపొందించిన విషయం తెలిసిందే. కోవ్యాక్సిన్ పేరుతో దీన్ని తయారు చేసింది. తొలిదశ క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ వ్యాక్సిన్. ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఫలితంగా- ఇక హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు పూనుకుంది. దీనికి ఐసీఎంఆర్ నుంచి అనుమతిని పొందింది.
మనుషులపై ప్రయోగించే ఈ కోవ్యాక్సిన్ గనక సత్ఫలితాలను ఇవ్వగలిగితే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు ఐసీఎంఆర్ అధికారులు. అందుకే- ఈ ట్రయల్స్ను వేగవంతం చేయాలంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ.. భారత్ బయోటెక్ యాజమాన్యానికి లేఖ రాశారు. నెలన్నర వరకు గడువు ఉన్నందున.. తాము నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించాలని బలరాం భార్గవ సూచించారు.