పెండింగ్లో ఉన్న ICSE మరియు ISC బోర్డు పరీక్షలు ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. అన్ని రంగాలను చిదిమేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యావ్యవస్థలకు తాళం పడింది. ఇక కీలకమైన పదవ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ అంతా బాగుండి ఉంటే ఇప్పటికల్లా పదవ తరగతి పరీక్షలు పూర్తయి పిల్లలు హాలీడేస్ను ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అనే టెన్షన్ విద్యార్థుల్లో ఉంది. అందుకే ఇళ్లకే పరిమితమై చదువుకుంటున్నారు.
తాజాగా ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన పదవ తరగతి పరీక్షలను తిరిగి లాక్డౌన్ తర్వాత నిర్వహిస్తామని ఐసీఎస్ఈ ప్రకటించింది. లాక్డౌన ఎత్తివేయగానే 6 నుంచి 8 రోజుల్లో వరసగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. శనివారం ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఐసీఎస్ఈ కౌన్సిల్ తెలిపింది. ఇప్పటికే ఇతర బోర్డులు 10వ తరగతి 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశాయి. ఇదిలా ఉంటే ఐఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి మరో 8 సబ్జెక్టులు ఉన్నాయి. మరోవైపు ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఆరు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ లాక్డౌన్ తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
10వ తరగతి ఐసీఎస్ఈ పరీక్షలు పెండింగ్లో ఉన్న సబ్జెక్టులు జియోగ్రఫీ,హెచ్సీజీ పేపర్ 2, బయలాజీ- సైన్స్ పేపర్ 3, ఎకనామిక్స్ గ్రూప్స్ ఎలక్టివ్, హిందీ, ఆర్ట్ పేపర్ -4లు ఉన్నాయి. ఐఎస్సీ బోర్డు ఎగ్జామ్ 12వ తరగతి పరీక్షలు పెండింగ్లో ఉన్న సబ్జెక్టులు బయాలజీ పేపర్ 1, బిజినెస్ స్టడీస్, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, హోమ్ సైన్స్ పేపర్ 1, ఎలక్టివ్ ఇంగ్లీష్, ఆర్ట్ పేపర్ 5లు ఉన్నాయి. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం లాక్డౌన్కు వెళ్లిపోయిన నేపథ్యంలో ఐసీఎస్ఈ మరియు ఐఎస్సీ బోర్డు పరీక్షలు మధ్యలోనే నిలిచిపోయాయి.
ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తివేస్తే పరీక్షల నిర్వహణపై కేంద్రప్రభుత్వం సమన్వయంతో నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ వెల్లడించింది. పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే పరీక్షలు నిర్వహణకు 8 రోజుల ముందే కొత్త తేదీలను ప్రకటిస్తామని దీంతో విద్యార్థులు తిరిగి సమాయత్తమవుతారని స్పష్టం చేసింది కౌన్సిల్. ఇక పరీక్ష ఫలితాలు కూడా ఆరు నుంచి ఎనిమిది వారాల్లోగా విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇక 10వ తరగతి విద్యార్థులకు 11వ తరగతిలోకి అడ్మిషన్ ఇవ్వాలని బోర్డు ప్రకటించింది. అదే సమయంలో ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని సూచించింది.