ఫిర్యాదులొస్తున్నాయ్, ఇబ్బంది పెట్టొద్దు: బ్యాంకులకు ఆర్బీఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, 1000 నోట్లను మార్చుకునేందుకు వచ్చిన ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని భారత రిజర్వు బ్యాంక్.. బ్యాంకులకు స్పష్టం చేసింది. నోట్ల మార్పిడి కోసం వచ్చిన కష్టమర్లను ఫొటోలు, ఐడీ ప్రూఫ్ అడగవద్దని తేల్చి చెప్పింది.
అంతేగాక, రూ.500, వెయ్యి నోట్ల నగదు మార్పిడి విషయంలో కచ్చితమైన నియమ, నిబంధనలు పాటించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అర్బన్ కో-ఆపరేటివ్, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆదేశించింది.
ముఖ్యంగా ఖాతాదారుల నుంచి నగదు స్వీకరణలో కో-ఆపరేటివ్ బ్యాంకులను నుంచి సహకారం లేదంటూ పలు చోట్ల ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.
'అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, నాబార్డులు.. ఆర్బీఐ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఖాతాదారుల నుంచి పాత నగదు తీసుకుని కొత్తవి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు' అని ఆర్బీఐ స్పష్టం చేసింది.