టెలికాంరంగంలో అతిపెద్ద విలీనం: వొడాఫోన్తో ఐడియా విలీనం పరిపూర్ణం
Recommended Video
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా మరో సంస్థ వొడాఫోన్తో విలీనం అవుతుందని వచ్చిన వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. వొడఫోన్లో ఐడియా సెల్యూలార్ విలీనం పూర్తయింది. ఇకపై వొడాఫోన్ ఐడియాగా పిలవబడుతుంది. ఐడియా వొడఫోన్తో విలీనం కావడంతో భారత దేశంలో అత్యధిక కస్టమర్లు ఉన్నట్లుగా గుర్తింపు పొందింది. ఐడియా కలిసి పోవడంతో వొడాఫోన్కు 408 మిలియన్ వినియోగదారులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
కొత్తగా ఏర్పాటైన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్కు 12 మంది బోర్డు డైరెక్టర్లు ఉండగా.. అందులో స్వతంత్ర డైరెక్టర్లుగా ఆరుగురు ఉంటారు. కుమార మంగళం బిర్లా దీనికి ఛైర్మెన్గా వ్యవహరిస్తుండగా... సీఈఓగా బాలేష్ శర్మ బాధ్యతలు చేపడతారని కంపెనీ నుంచి విడుదలైన సంయుక్త ప్రకటన పేర్కొంది. రెండు టెలికాం దిగ్గజ కంపెనీలు కలిసిపోవడంతో మార్కెట్లో 32శాతంగా రెవెన్యూ షేర్ ఉండనుంది. టాప్ 9 టెలికాం సర్కిళ్లలో ఇకపై వొడాఫోన్ ఐడియాదే ప్రథమ స్థానంగా ఉండనుంది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలతో పాటు సమానంగా పోటీపడే స్థాయికి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ వచ్చేసిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
రెండు కంపెనీల కలయికతో 3.4లక్షల సైట్లతో బ్రాడ్ బాండ్ నెట్వర్క్.. 17 లక్షల రీటెయిల్ ఔలెట్లతో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లుంటాయని సంస్థ తెలిపింది. ఐడియా ఈక్విటీ రూ.6750 కోట్లు, వొడాఫోన్ ఈక్విటీ రూ.8,600 కోట్లు ఉండగా... రెండు సంస్థలకు చెందిన టవర్ల ఎంటర్ ప్రైజ్ వాల్యూ రూ.7850 కోట్లు ఉందని తెలిపాయి. దీంతో టెలికాం శాఖకు రూ.3900 కోట్లు చెల్లించినా.. ఇంకా రూ.19300 కోట్లు మిగులు బ్యాలెన్స్ ఉంటుందని కంపెనీ తెలిపింది. రెండు కంపెనీలు కలిసి పోవడంతో స్పెక్ట్రమ్ కూడా పెరిగిందని ఇప్పుడు అది 1,850 MHzగా ఉందని తెలిపింది. దీంతో 2లక్షల మొబైల్ సైట్లు,2.35 లక్షల కిలోమీటర్ల ఫైబర్లు ఉన్నాయని పేర్కొంది. ఇక వాయిస్, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ దేశవ్యాప్తంగా ఉంటుందని దాదాపు 92 శాతం జనాభాను కవర్ చేస్తూ... 5కోట్ల పట్టణాలు గ్రామాలకు చేరువవుతుందని సంస్థ వివరించింది.
ఐడియాను వొడాఫోన్లో విలీనం చేయడం ద్వారా భారత్లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఆవిర్భవించామని ఇది చరిత్రాత్మకమని ఛైర్మెన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందిస్తామని ఆయన చెప్పారు.