కశ్మీర్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు: భారత బలగాల దెబ్బకు తోకముడిచిన ఉగ్రవాదులు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. త్రివర్ణ పతకాన్ని గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. ఆపై పారామిలటరీ బలగాల పరేడ్ను వీక్షించారు.
భారత బలగాలు గట్టి భద్రతా ఏర్పాట్లతో ఉగ్రవాదులు తోకముడిచారని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. అంతేకాదు జమ్ము కశ్మీర్లో ఉంటున్న ప్రజలు తమ పౌరసత్వం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. కేంద్ర పాలిత రాష్ట్రంగా చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజల్లో తమ పౌరసత్వంపై పలు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని చెప్పిన ఆయన ఉగ్రవాదంను అణిచివేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇందుకు నిదర్శనం శుక్రవారం ఈద్ ప్రార్థనల తర్వాత ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరగకపోవడమే అని తెలిపారు. ఇప్పటికే ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం కూడా తగ్గిపోయిందని చెప్పారు సత్యపాల్ మాలిక్.
ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజున శాంతి భద్రతలు సాధారణ స్థితికి చేరడంతో జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్తో పాటు, కశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించడం జరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఇదిలా ఉంటే ఆగష్టు 5న జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అక్కడ పెద్దగా ఎలాంటి ఆందోళనలు జరగలేదు. తాజాగా చాలా ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.