CBDT కొత్త రూల్: ఇవి లేకపోతే వేతనం నుంచి 20శాతం టీడీఎస్ కింద కట్ అవుతుంది
న్యూఢిల్లీ: ఏడాదికి మీ సంపాదన రూ.2.5 లక్షలు లేక అంతకంటే ఎక్కువగా ఉందా...? మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థలో మీ పాన్ కార్డు వివరాలు, ఆధార్ వివరాలను వెంటనే సబ్మిట్ చేయండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఆధార్ వివరాలు, పాన్కార్డు వివరాలు సబ్మిట్ చేయకుంటే అట్టివారి వేతనం నుంచి టీడీఎస్ కింద 20శాతం కోత విధించాలని చెబుతూ అన్ని కార్యాలయాలకు సంస్థలకు ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇది జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది. రూ.2.5 లక్షలు లేదా అంతకంటే సంపాదన ఉన్నవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
టీడీఎస్ పేమెంట్లు, దీనిద్వారా వచ్చే రెవిన్యూను మానిటర్ చేసేందుకు ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది సీబీడీ. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను టీడీఎస్ సెగ్మెంట్ నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా 37 శాతం రెవిన్యూ వచ్చినట్లు సీబీడీటీ తెలిపింది. నిబంధనలకు సంబంధించి మొత్తం 86 పేజీల సర్క్యులర్ను సీబీడీటీ విడుదల చేసింది. అదే సమయంలో ఇన్కం ట్యాక్స్ చట్టం ప్రకారం ఉద్యోగస్తులు తమ ఆధార్ వివరాలను, పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని పేర్కొంది.
ఉదాహరణకు మీ ఏడాది సంపాదన రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఎలాంటి ట్యాక్స్ కటింగ్లు ఉండవు. మీ వేతనంలో అన్ని కటింగ్స్ పోను ఇంకా 20శాతం టాక్స్ శ్లాబ్లోకి వస్తే ఇక్కడే టీడీఎస్ రేట్ 20శాతం అప్లయ్ అవుతుంది. ఒకవేళ మీ వేతనం 30శాతం టాక్స్ రేట్ కిందకు వస్తే.. మీ సంస్థ సగటు టాక్స్ రేటును లెక్కిస్తుంది. అంటే మొత్తం టాక్స్ లైబిలిటీ / మొత్తం ఏడాది సంపాదన కింద లెక్కిస్తుంది. అప్పటికి సగటు టాక్స్ రేట్ 20శాతం ఉంటే టీడీఎస్ 20శాతం అప్లయ్ అవుతుంది. ఒకవేల కటింగ్స్ ఎక్కువగా పోతే 4శాతంగా ఉన్న హెల్త్ సెస్ మరియు ఎడ్యుకేషన్ సెస్ల మినహాయింపు ఉంటుంది.
ఇక ఈ నిబంధన తీసుకురావడం వెనక కారణం వివరించింది సీబీడీటీ. పాన్ మరియు ఆధార్ వివరాలు లేకపోవడంతో రుణాలు మంజూరు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించింది. వేతనాల నుంచి పన్నుల రూపంలో కోతలు విధించే వారు ఆధార్, మరియు పాన్ వివరాలను పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఫామ్ 24Q టీడీఎస్కు సంబంధించిన వివరాలను తెలిపే సందర్భంలో పాన్ ఆధార్ వివరాలు కూడా ఇవ్వాలని సీబీడీటీ సూచించింది.